ఆమంచి కృష్ణ మోహన్కు సీబీఐ ఉచ్చు: నోటీసులు: ఆ వ్యాఖ్యల ఎఫెక్ట్: లిస్ట్లో మరికొందరు?
ఒంగోలు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ చిక్కుల్లో పడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆయనపై కన్నేసింది. నోటీసులను జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నెల 6వ తేదీన ఆయన సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. మున్ముందు మరి కొందరు వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు సీబీఐ నుంచి నోటీసులు అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు సందర్భంగా వారు ఇచ్చే సమాధానాలు సంతృప్తికరంగా లేకపోతే.. చట్టపరంగా చర్యలను ఎదుర్కోవచ్చని చెబుతున్నారు.
ఏపీ హైకోర్టు నుంచి ఇదివరకు కొన్ని కీలక అంశాల్లో వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చాయని భావిస్తోన్న తీర్పులపై చేసిన వ్యాఖ్యాల వల్లే ఆమంచి కృష్ణ మోహన్..తాజాగా సీబీఐ విచారణను ఎదుర్కొంటోన్నారు. హైకోర్టు, న్యాయమూర్తులను కించపరిచేలా వ్యాఖ్యానాలు చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.. తీర్పులిచ్చిన న్యాయమూర్తులకు రాజకీయాలను అపాదించడం, వారిని భయభ్రాంతులకు గురి చేసేలా బహిరంగ వ్యాఖ్యలు చేయడం సీబీఐ నోటీసులకు కారణమైంది.
హైకోర్టు ఇచ్చిన తీర్పులను తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా ఆమంచి కృష్ణ మోహన్తో పాటు మరికొందరు వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు వ్యాఖ్యలు చేశారని, త్వరలో వారికి కూడా సీబీఐ నోటీసులు అందవచ్చని తెలుస్తోంది. పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, అభిమానులు హైకోర్టు తీర్పులను తప్పు పడుతూ పోస్టులు పెట్టారు. వాటిని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కోర్టు ధిక్కారణగా భావించింది. అలాంటి పోస్టులపై సమగ్ర విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఎనిమిది వారాల్లోగా సమగ్ర నివేదికను అందజేయాలంటూ సూచించింది.
Recommended Video
హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు గత ఏడాది నవంబర్ 11వ తేదీన ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. 153ఏ, 504, 505 (2), 506, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. ఆమంచి కృష్ణ మోహన్తో పాటు అప్పట్లో హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసిన మరి కొందరు వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులకు త్వరలోనే సీబీఐ నోటీసులను పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.