వైసీపీలోకి కరణం బలరాం .. చంద్రబాబు ఎమర్జెన్సీ మీటింగ్.. చీరాల ఇంచార్జ్ గా యడం బాలాజీ
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఊహించని విధంగా దశాబ్దాల కాలంగా టీడీపీ కోసంపని చేసిన కీలక నేతలు పార్టీ మారి వైసీపీ తీర్ధం తీసుకోవటం రాజకీయంగా దుమారం రేపుతుంది. ఇక టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది . డొక్కామాణిక్య వరప్రసాద్, సతీష్ రెడ్డి , కదిరి బాబురావు, పంచకర్ల రమేష్ బాబు, రామ సుబ్బారెడ్డి వంటి నాయకులు తాజాగా టీడీపీకి షాక్ ఇచ్చారు. తాజాగా కరణం బలరాం నిర్ణయంతో అత్యవసర సమావేశం నిర్వహించిన బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ లో చేరతానని ప్రకటించిన కరణం బలరాం
వైసీపీకి టీడీపీ నుండి వలసలు కొనసాగుతున్నాయి. ఇక అదే బాటలో టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆ పార్టీకి టాటా చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యకర్తలతో, తన అనుయాయులతో సమావేశం నిర్వహించి అధికారిక ప్రకటన కూడా చేశారు. చీరాలలోని తన కార్యాలయం నుంచి భారీగా అనుచరగణం, కార్యకర్తలతో కరణం అమరావతిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి బయల్దేరారు. ఆయన వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన నేపధ్యంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
టీడీపీకి మరో షాక్ ... జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి
అత్యవసర సమావేశం నిర్వహించిన చంద్రబాబు
అసలు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇంత పెద్ద ఎత్తున వలసలను ఊహించలేదు. కీలక నాయకులు పార్టీ వీడి వెళతారని ఆయన గుర్తించలేకపోయారు. ఒకరి తరువాత ఒకరు దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే చంద్రబాబు షాక్ కు గురవుతున్నారు. టీడీపీకి ఎంతో విశ్వాసంగా పని చేసిన కరణం బలరాం కూడా నేడు పార్టీ మారతానని ప్రకటన చెయ్యటం చంద్రబాబుకు ప్రకాశం జిల్లాలో ఇబ్బందికర పరిస్థితి తెచ్చి పెట్టింది. ఇక ఈ నేపధ్యంలో ప్రకాశం జిల్లా నాయకులతో బాబు సమావేశం నిర్వహించారు.
Recommended Video
స్థానిక ఎన్న్నికల నేపధ్యంలో పార్టీ పరిస్థితిపై చర్చించిన చంద్రబాబు
ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ప్రకాశం జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కరణం బలరాం లేకుండా పార్టీ పరిస్థితి ఏంటి ? వైసీపీలో చేరితే స్థానికంగా ఎలాంటి ఇబ్బంది ఉండొచ్చు ? నియోజకర్గానికి ఇంచార్జ్గా ఎవర్ని నియమించాలి..? తదుపరి పరిణామాలేంటి..? ఈ సమస్యను అధిగమించటానికి ఏం చెయ్యాలి అనే విషయాలపై నేతలతో చంద్రబాబు నిశితంగా చర్చిస్తున్నారు.
పాల్గొన్న ప్రకాశం జిల్లా నేతలు ... చీరాల ఇంచార్జ్ గా యడం బాలాజీ
చంద్రబాబు సమావేశంలో సాంబశివరావు, గొట్టిపాటి రవి, వీరాంజనేయస్వామి, సత్యప్రసాద్ తదితరులు ఉన్నారు.ఇక ఈ సమావేశంలో చంద్రబాబు ఆదేశాల ప్రకారం చీరాల నియోజకవర్గ ఇంచార్జ్గా యడం బాలాజీని నియమించారు . దీంతో ప్రకాశం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారాయి. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా వుంటుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.