రక్తమోడిన చినగంజాం: టీడీపీ, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఘర్షణ: మహిళ మృతి
ఒంగోలు: ఎక్కడో పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలకే పరిమితమైందనుకుంటున్న పోలింగ్ హింస.. మన రాష్ట్రంలోనూ తలెత్తింది. మార్చి 11వ తేదీన రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా రాజుకున్న మంటలు ఇంకా జ్వలిస్తూనే వస్తున్నాయి. పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న దాడులకు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలో టీడీపీ, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల మధ్య సంభవించిన ఘర్షణల నేపథ్యంలో.. ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆమెను టీడీపీ కార్యకర్త పద్మజగా గుర్తించారు.
ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చినగంజాం మండలం రుద్రమాంబపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రుద్రమాంబపురంలో ఈ రెండు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రుద్రమాంబపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్త పద్మజ ఇంటిపై మంగళవారం ఉదయం కొందరు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆమెతో వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో పద్మజకు గాయాలయ్యాయి. దీనితో మనస్తాపానికి గురైన పద్మజ.. ఇంట్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. దీనితో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు అక్కడి నుంచి పరారయ్యారు.
Recommended Video
సమాచారం అందుకున్న వెంటనే ఇంకొల్లు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పద్మజ మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం తరలించారు. పద్మజ మరణంతో రుద్రమాంబపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతిదాడులకు దిగే ప్రమాదం ఉండటంతో.. స్థానికంగా పికెటింగ్ ఏర్పాటు చేశారు. పోలీసులను మోహరింపజేశారు. చీరాల డీఎస్పీ నాగరాజు రుద్రామంబపురంలో మకాం వేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తమ పార్టీ కార్యకర్తలపై విస్తృతంగా దాడులు చోటు చేసుకుంటున్నాయని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఇదివరకు పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ మద్దతుదారులపై దాడులు చేశారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని టీడీపీ జిల్లా స్థాయి నాయకులు ప్రశ్నిస్తున్నారు. పోలింగ్ అనంతరం గ్రామాల్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చడంలో పోలీసులు విఫలం అయ్యారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమకు అనుకూలమైన పోలీసులను మోహరించిందని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అకారణంగా కేసులు బనాయిస్తున్నారని విమర్శిస్తున్నారు.