నాకు శత్రువులు ఎక్కువ: ఇంగ్లీషు మీడియంలో ముందుకే.. సిగ్గుతో తలదించుకోవద్దు: సీఎం జగన్ స్పష్టీకరణ!
ముఖ్యమంత్రి జగన్ ఇంగ్లీషు మీడియం నిర్ణయం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. పేదవారికి ఇంగ్లీషు చదువుల ఉండకూడదా అని ప్రశ్నించారు. ఏ నిర్ణయం తీసుకున్నా పదేళ్ల తరువాత భవిష్యత్ కు మేలు చేసే నిర్ణయాలు ఉండాలని..అందులో వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేసారు. ఈ విషయంలో అందరూ తనను లక్ష్యంగా చేసుకున్నారని..అయినా చరిత్రను మార్చే అడుగుల నుండి వెనక్కు పోనని చెప్పారు. రాజకీయ నేతలు..ఉప రాష్ట్రపతి..సినీ హారో ఇలా..అందరూ టార్గెట్ చేసారని చెప్పుకొచ్చారు. పిల్లల మంచి కోసమే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. జనవరి 9 నుండే అమ్మఒడి అమలు చేస్తామని .. కాలేజీల్లో చదివే వారికి ఫీజు రీయంబర్స్ మెంట్ అమలు చేస్తామని చెప్పారు. తనకు శత్రువులు ఎక్కువ అని చెప్పిన ముఖ్యమంత్రి..ప్రజల మద్దతులో తన మీద ఉంచిన నమ్మకాలకు అనుగుణంగా నడుచుకుంటానని జగన్ వెల్లడించారు.
ఇసుక అక్రమంగా అమ్మితే కఠిన శిక్ష: ఇంగ్లీషు మీడియంపైన ముందుకే: ఏపీ కేబినెట్ నిర్ణయాలు..!
నాకు శత్రువులు ఎక్కువ.. ఎవరు ఏం చేసినా..
తనకు శత్రువులు ఎక్కవని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా..పిల్లల భవిష్యత్ కు మేలు చేసే నిర్ణయంలో వెనుకడుగు వేయనని స్పష్టం చేసారు. ఒంగోలులో ఆయన నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంగ్లీషు మీడియం లేకపోతే పిల్లల చదువుకు భవిష్యత్ లేదన్నారు. ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీషు చదవులు తప్పనిసరని అని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
పిల్లలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత
ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్నవారు ఎంతో మంది తొలుత తెలుగు మీడియంలో చదవి.. ఆ తరువాత ఇంగ్లీషు మీడియంలో చదవటం వలనే ఆ స్థానాలకు చేరుకున్నారని వివరించారు. తెలుగు జాతికి అన్యాయం చేస్తున్నానంటూ విమర్శలు చేస్తున్నారని..భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పిల్లలను తీర్చి దిద్దాల్సిన అవసరం అందరి పైన ఉందన్నారు. తెలుగు మీడియంలోనే ఉంటే భవిష్యత్ ఉండదని..అదే సమయంలో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తున్నామని జగన్ స్పష్టం చేసారు.
చరిత్రను మార్చే అడుగులు ఇవి..
చరిత్రను మార్చే అడుగు ఎక్కడో ఒక చోట పడాలని..అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని జగన్ చెప్పుకొచ్చారు. పిల్లలను బడికి పంపితే 15 వేలు అమ్మకు ఇస్తామని...దీనిని వచ్చే జవనరి 9న ప్రారంభిస్తామని ప్రకటించారు. 2020 లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీషు మీడియం భోదన ఒకటి నుండి ఆరో తరగతి వరకు ప్రారంభిస్తామని..ఆ తరువాత ఒక్కో తరగతికి పెంచుకుంటూ వెళ్తామని వివరించారు. ఇందు కోసం టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం అని ఏపీ సీఎం స్పష్టం చేశారు.
సిగ్గుతో తలదించుకొనేలా ఉండొద్దు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలకు ఇంగ్లీషు రాకపోతే భవిష్యత్ ఏంటని జగన్ ప్రశ్నించారు. ప్రపంచంతో పోటీ పడాల్సిన పిల్లలు సిగ్గుతో తల దించుకొనే పరిస్థితులో ఉండకూడదన్నారు. తెలుగు సమాజం ప్రపంచంతో పోటీ పడాల్సిన అవసరం లేదా అని నిలదీసారు. రాజకీయ నేతలు..రాజ్యాంగ పదవిలో ఉన్న వారు.. సినీ హీరోలు తన పైన విమర్శలు చేస్తున్నారని..అయినా..తాను ఈ విషయంలో పిల్లల భవిష్యత్ కు మేలు చేసేదిగా భావించి ముందుకే వెళ్తున్నానని స్పష్టం చేసారు.
పాఠశాలల రూపు రేఖలు..ఫీజు రీయంబర్స్ మెంట్..
మనబడి నాడు-నేడు లో భాగంగా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.12 వేల కోట్లను కేటాయించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. తొలి దశలో 15,715 పాఠశాలల్లో 9 రకాల సౌకర్యాలతో అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యార్ధుల పైనే కాకుండా.. కాలేజీ విద్య చదివే వారి కోసం పూర్తి స్థాయిలో ఫీజు రీయంబర్స్ మెంట్ అందిస్తామని ప్రకటించారు. ప్రతీ కుటుంబంలో ఒక్కరైనా ఉన్నత విద్యా వంతుడు అయి ఉండాలని ఆకాంక్షించారు. అయితే, తెలుగు మీడియంలో చదివే వారికి భవిష్యత్ లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయంగా చర్చకు..వివాదానికి కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.