ప్రకాశం జిల్లా స్కూళ్లలో కరోనా కలకలం- విద్యార్దులు, ఉపాధ్యాయులకూ వైరస్ నిర్దారణ..
ఏపీలో కరోనా ప్రభావం కాస్త తగ్గినందున పాఠశాలలు తిరిగి ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయం పలు చోట్ల బూమరాంగ్ అవుతోంది. కరోనా ప్రభావం ఇంకా తగ్గని జిల్లాల్లో విద్యార్ధులు, టీచర్లు వైరస్ బారిన పడుతున్నారు. ప్రకాశం జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్ధులకు కరోనా సోకినట్లు నివేదికలు వస్తున్నాయి.
ఏపీలో అత్యల్ప స్ధాయికి కరోనా- 24 గంటల్లో కేవలం 1916 కేసులు, 14 మరణాలు..
ప్రకాశం జిల్లాలోని నాలుగు జడ్పీ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్ధులకు కరోనా సోకినట్లు తేలింది. ఇందులో జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్ధులతో పాటు ఓ టీచర్కూ కరోనా సోకింది. అలాగే త్రిపురాంతకం జడ్పీ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. పీసీపల్లి హైస్కూల్లోనూ ఓ విద్యార్ధి, మరో ఉపాధ్యాయుడికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. పెద్దగొల్లపల్లిలోని మరో ఉపాధ్యాయుడికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో పాఠశాలలు తెరిచాక ప్రకాశం జిల్లాలోని స్కూళ్లలో మొత్తం మీద ఏడుగురికి కరోనా సోకినట్లయింది.
ప్రకాశం జిల్లాలో పలు పాఠశాలల్లో కరోనా కేసులు రావడంతో విద్యార్ధులు, తల్లితండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో విద్యాశాఖ అధికారులు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు తెలియజేయాలని సూచించారు. కరోనా కేసుల ప్రభావం ఇంకా తగ్గని జిల్లాల్లో ప్రకాశం జిల్లా కూడా ఉంది. దీంతో ఇక్కడ ఉపాధ్యాయుల నుంచి విద్యార్ధులకు లేదా విద్యార్ధుల నుంచి ఉపాధ్యాయులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది.