కేంద్రమంత్రులను కలుసుకోవడంలో విఫలం..!ఇక ఏం సాధిస్తారని ఏపి సీఎంకు పవన్ సూటి ప్రశ్న..!!
అమరావతి/హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఏపి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇసుక, మద్యం పాలసీ, పించన్లు, నిరుద్యోగం, రాజధాని, పోలవరం, ప్రత్యేక హోదా తదితర అంశాలపై ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలే కాకుండా సుధీర్గ పాద యాత్రలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలపట్ల ఎంత వరకు చిత్తశుద్దితో ఉన్నారనే అంశాలను గుర్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసారు.
ఏపి సీఎం ఢిల్లీ పర్యటన్ ఫెయిల్..! విమర్శనాస్త్రాలు సంధించిన గబ్బర్ సింగ్..!!
కేంద్ర మంత్రుల అప్పాయింట్ మెంట్ దక్కించుకోవడంలోనే గందరగోళం నెలకొంటే ఇక హామీలను ఎలా సాధిస్తారని జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. సీఎం జగన్ పర్యటనను సునిశితంగా గమనించిన పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నేరుగా తలపడేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అందుకు ఏపీలో నెలకొన్న సమస్యలను ఆధారం చేసుకోవడంతో పాటు సీఎం జగన్ కదలికలపైన దృష్టి సారించారు గబ్బర్ సింగ్. ముఖ్యంగా కేంద్రంతో సత్సంబంధాలపై జగన్ వైఖరి ఎలా ఉండబోతుందనే అంశంపై జనసేననాని ఫోకస్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
కేంద్ర మంత్రులతో సఖ్యతలేదు..! ఇక హామీలు ఏలా సాధిస్తారన్న పవన్ కళ్యాణ్..!!
తనపై కేసులు ఉన్నంత మాత్రాన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో రాజీ పడొద్దనే అంశాన్ని ప్రభుత్వ వర్గాలకు బలంగా వినిపించేందుకు జనసేన కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఢిల్లీ వెళ్లిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రుల వద్ద రాష్ట్ర ప్రాజెక్టుల ఆవశ్యకత గురించి సరిగ్గా ప్రస్థావించలేక పోయారని వపన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేసారు. సీబీఐ కేసుల భయం ముఖ్యమంత్రి కి ఉందని, విశాఖ ఎయిర్ పోర్టులో తనపై జరిగిన దాడికి సంబంధించిన కేసు ఏమైందని పవన్ సూటిగా ప్రశ్నించారు. సొంత చిన్నాన్న కిరాతకంగా హత్యకు గురైతే ఇప్పటికీ ఏమీ తేల్చలేక పోయారని పవన్ నిలదాసారు. జగన్ కు అప్పుడు ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్నారని, ఇప్పుడు సీబీఐకి కేసు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.
జగన్ విధానాలపై పోరాటం..! కార్యాచరణ రూపొందిస్తున్న జనసేన..!!
అంతే కాకుండా సీఎం వైయస్ జగన్ పాలనపై నేరుగానే ఉద్యమించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగం సిద్దం చేస్తున్నారు. త్వరలో జగన్పై పోరుబాటకు సిద్దంగా ఉండాలని కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. జగన్పై నేరుగా ఉద్యమించేందకు నవంబర్ నెలలో కార్యాచరణకు దిగనున్నారని పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఏపీలో ఇసుక కొరత ఇప్పుడు జగన్ సర్కారును వేధిస్తున్న సమస్య. ఇసుక కొరతతో భవన నిర్మాణాలు ఆగిపోయాయి. అయితే ఇసుక కొరత రావడానికి కారణం ఏపీ ప్రభుత్వం తీసుకున్న వైఖరే కారణమని జనసేన పార్టీ ముందు నుంచి ఆరోపణలు గుప్పిస్తోంది. ముందునుంచి భవన నిర్మాణ కార్మికులకు మద్దతు తెలుపుతోంది జనసేన పార్టీ. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఆందోళనకు సిద్ధమవుతోంది.
ఇసుక కొరతపై కొరడా..! భవన నిర్మాణ కార్మికులకు అండగా కాటమరాయుడు..!!
నవంబర్ 3వ తేదీన విశాఖలో ర్యాలీ నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఈ ర్యాలీ చేపట్టనున్నట్టు జనసేన నాయకులు వెల్లడించారు. విశాఖలో నిర్వహించే ఈ ర్యాలీ ఏర్పాట్లకు పార్టీ నేత తోట చంద్రశేఖర్ నేతృత్వంలో ఓ సబ్ కమిటీని వేశారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు కాటమరాయుడు. భవన నిర్మాణ కార్మికులకు తాము అండగా నిలుస్తామని వెల్లడించారు. అంటే ఇక ముందు ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాల్లో జరిగే లోపాలను ఎత్తి చూపేందుకు పవన్ కళ్యాణ్ నేరుగానే ఉద్యమించనున్నారని సంకేతాలను పంపిస్తున్నారు గబ్బర్ సింగ్.