తిరుమల దర్శనానికి వెళ్తుండగా ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం!!
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కంభం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. కంభం సమీపంలో వేగంగా వస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
కారులో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు నుంచి ఐదుగురు తిరుపతికి వెళుతున్నారు. వీరంతా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు 60 సంవత్సరాల హనిమిరెడ్డి, 60 ఏళ్ల గురవమ్మ, 55 సంవత్సరాల అనంతమ్మ, 58 సంవత్సరాల ఆదిలక్ష్మి, 24 సంవత్సరాల నాగిరెడ్డి గా గుర్తించారు. వీరంతా మాచర్ల నుండి తిరుపతికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది.
వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారా అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, వారి బంధువులకు సమాచారం అందించారు. తిరుమల స్వామి దర్శనానికి బయలుదేరి అనంతలోకాలకు చేరుకోవటంతో మృతుల బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గట్టమ్మ దేవాలయం వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు దుర్మరణం పాలయ్యాడు తీవ్ర గాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పత్తి మిల్లు లో పనిచేస్తున్న యువకుడు పని పూర్తి చేసుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తత అవసరం అని పోలీసులు పదేపదే చెబుతున్నా వాహనదారులు మితిమీరిన వేగంతో, అప్రమత్తంగా లేకుండా వాహనాలను నడపడంతో ఇటువంటి ఘోర ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనేకమంది కుటుంబాలలో రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపుతూ, దారుణమైన పరిస్థితులకు కారణమవుతున్నాయి.