మీ బిడ్డ జగన్ కష్టాన్ని గుర్తించండి, వైఎస్ పాలనను గుర్తు చేసుకోండి: ప్రచార బరిలో విజయమ్మ
ఒంగోలు: రాష్ట్రంలో పోలింగ్ గడువు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార వేడిని మరింత పెంచింది. ఇప్పటికే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ కు అండగా ఆయన తల్లి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బరిలో దిగారు. శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రోడ్ షో కార్యక్రమానికి విజయమ్మ హాజరయ్యారు.
కొడుకులై ఉండీ..అల్లుళ్లై ఉండీ..నాపై చెప్పులేయించారు: వర్మ మార్క్ వైస్రాయ్ కుట్ర సీన్
ప్రకాశం జిల్లా నుంచి ఆమె తన ప్రచార కార్యక్రమాలను ఆరంభించారు. జిల్లాలోని కందుకూరులో రోడ్ షోలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి పోటీ చేస్తోన్న అసెంబ్లీ నియోజకవర్గం ఇది. ఎన్నికల ప్రచారంలో విజయమ్మతో పాటు మహీధర్ రెడ్డి, నెల్లూరు లోక్ సభ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సహా పలువురు నాయకులు విజయమ్మతో పాటు పాల్గొన్నారు. వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు.
జగన్ మాతో కంటే..మీతోనే ఎక్కువ మమేకం అయ్యారు..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఓటు వేయడానికి ముందు ప్రతి ఒక్కరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన పరిపాలనను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని కోరారు. వైఎస్ పాలనను మళ్లీ తీసుకుని రావడం ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యపడుతుందని చెప్పారు. వైఎస్ హయాంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న అభివృద్ధిని, చంద్రబాబు హయాంలో పరిపాలనను బేరీజు వేసుకోవాలని సూచించారు. 2014 ఎన్నికల తరువాత.. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో గడిపిన రోజులు, సందర్భాల కంటే ప్రజలతోనే ఎక్కువగా మమేకం అయ్యారని చెప్పారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారు ఎదుర్కొంటున్న ప్రతి చిన్న సమస్యను కూడా తెలుసుకున్నారని అన్నారు. సమస్యలను ఎలా పరిష్కరించాలనే విషయంపై జగన్ కు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు. జగన్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు- ఇడుపుల పాయలో..
ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించడానికి ముందు- విజయమ్మ ఇడుపులపాయకు వెళ్లారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలను చేశారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం కందుకూరుకు బయలుదేరి వెళ్లారు.