శాసన మండలి సభ్యత్వానికి టీడీపీ మహిళా నేత రాజీనామా: ఇదివరకే వైసీపీలో: అనర్హత పిటీషన్
అమరావతి: తెలుగుదేశం పార్టీ మాజీ నాయకురాలు పోతుల సునీత.. తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆమె కొద్దిసేపటి కిందటే శాసన మండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్కు పంపించారు. తెలుగుదేశం పార్టీ తరఫున శాసనమండలికి ఆమె ఎన్నికయ్యారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో పోతుల సునీత అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. మూడు రాజధానుల వ్యవహారంలో అధికార వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి వీలుగా శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు.
అనంతరం ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులు మండలి ఛైర్మన్కు ఫిర్యాదు చేశారు. అనర్హత పిటీషన్ను దాఖలు చేశారు. ఈ పిటీషన్పై విచారణ కొనసాగుతోంది. ఈ దశలో ఆమె తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడు రాజధానులకు అనుకూలంగా ఓటు వేసిన అనంతరం పోతుల సునీత.. వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ ఏడాది జనవరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకొన్నారు.
మూడు రాజధానులకు అనుకూలంగా శాసన మండలిలో పోతుల సునీతతో పాటు తెలుగుదేశం పార్టీకే చెందిన మరో సభ్యుడు శివనాథ్ రెడ్డి కూడా ఓటు వేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ తెలుగుదేశం పార్టీ జారీ చేసిన విప్ను ధిక్కరించారు. వారికి సంబంధించిన అనర్హత పిటీషన్ ప్రస్తుతం విచారణ దశలో ఉంది. ఈ పరిస్థితుల మధ్య పోతుల సునీత తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామా పత్రంపై మండలి ఛైర్మన్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. రాజీనామా ఆమోదించమంటూ జరిగితే ఆ స్థానానికి మళ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి వస్తుంది. మళ్లీ పోతుల సునీతకే వైసీపీ ఛాన్స్ ఇవ్వనుంది.