గరికపాటి క్వారీ కూడా మూత..? గొట్టిపాటి, పోతుల రామారావు మాదిరిగానే...?
ఆంధ్రప్రదేశ్లో క్వారీల మూసివేత ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవలే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు గ్రానైట్ లీజులను ప్రభుత్వం రద్దుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో బీజేపీ నేత, మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు చేరారు. దీంతో టీడీపీయే కాకుండా.. బీజేపీ నేతల క్వారీలను కూడా ప్రభుత్వం వదలడం లేదని ఆ రెండు పార్టీలకు చెందిన శ్రేణులు విమర్శలు చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం జరిమానా చెల్లించకపోవడంతోనే పర్మిట్ రద్దు చేయల్సి వచ్చిందని చెబుతున్నారు.
రూ.200 కోట్ల జరిమానా..
బల్లికురవ వద్ద గరికపాటి రామ్మోహన్కు గ్రానైట్ క్వారీ ఉంది. ఆయన టీడీపీని వీడి బీజేపీలో చేరడంతో క్వారీ జోలికి అధికారులు వెళ్లరని గ్రానైట్ వ్యాపారులు భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం వదిలిపెట్టలేదు. గరికపాటికి చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి ముందు రూ.200 కోట్ల జరిమానా విధించింది. దీనితో కంపెనీ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. తర్వాత రెండోసారి కూడా గనుల అధికారులు నోటీసులు పంపారు. ఆ సమయంలో మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదు. గనుల అధికారులకు సంజాయిషీ లేఖను పంపించారు.
గరికిపాటి క్వారీ జోలికి వెళ్లలేదు.. ఎందుకంటే..
టీడీపీ నేతల క్వారీలపై కాలుష్య నియంత్రణ అధికారులు దాడులు చేశారు. కానీ గరికపాటి క్వారీ జోలికి మాత్రం వెళ్లలేదు. బీజేపీ నేత కావడంతో వదిలేశారనే చర్చ జరిగింది. కానీ నాలుగు రోజుల క్రితం మరోసారి నోటీసు పంపించారు. ఇదివరకు విధించిన రూ.200 కోట్ల జరిమానా చెల్లించాలని డిమాండ్ నోటీసులో ఉంది. అయితే దీనిని కంపెనీ పట్టించుకోలేదు. మరోసారి పంపించారు కదా.. ఎక్స్ ప్లానేషన్ ఇద్దామని అనుకున్నారు. కానీ ఈసారి మాత్రం గనుల అధికారులు వదిలిపెట్టలేదు.
సాయంత్రం ఫోన్ చేసి మరీ
గనులు, భూగర్భ శాఖ అధికారులు బుధవారం సాయంత్రం గరికపాటి క్వారీ మేనేజరుకు ఫోన్చేశారు. రవికుమార్, రామారావుల క్వారీలకు పర్మిట్లు నిలిపివేసిన పద్ధతిలోనే మీకు విక్రయ పర్మిట్లు ఇవ్వబోవడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని యాజమాన్యానికి తెలియజేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో కంపెనీ యాజమాన్యం ఏం చేయాలని ఆలోచిస్తోంది. కోర్టుకు వెళ్లాలా.. లేదంటే అధికారులకు మరోసారి సంజాయిషీ ఇచ్చి తిరిగి పర్మిట్ తెచ్చుకోవాలా అని భావిస్తోంది.
Recommended Video
1300 హెక్టార్లలో అస్మదీయులకు...?
ఇదిలా ఉంటే మరోవైపు నెల్లూరు జిల్లా చిల్లకూరు, కోట మండలాల పరిధిలో 1300 హెక్టార్లలో సిలికా మైన్లు ఉండగా.. 6 కంపెనీలు లీజుదారులుగా ఉన్నాయి. అంతకుముందు శేఖర్ రెడ్డి కంపెనీకి అక్రమంగా సిలికా మైన్స్ అప్పగించిన సంగతి తెలిసిందే. ఆరు కంపెనీలకు సంబంధించి.. దాదాపు అన్నీ 1980 నుంచి లీజుదారులుగా కొనసాగుతున్నాయి. వాస్తవానికి లీజు పీరియడ్ 10 నుంచి 20 ఏళ్లు ఉంది. కానీ ప్రభుత్వం లీజులను రద్దు చేయాలని నిర్ణయించింది. సిలికా మైన్లను ఏపీఎండీసీ పరిధిలోకి తీసుకొని.. కొత్తగా వాటికి టెండర్లు పిలవాలని భావిస్తోంది. తమ లీజు రద్దు చేయడం అన్యాయమని లైసెన్సీలు బోరుమంటున్నారు. మరో 300 హెక్టార్ల విస్తీర్ణంలో గల ప్రైవేట్ భూముల్లో గల మైనింగ్ లీజులను రద్దు చేస్తామని సంకేతాలు ఇచ్చారు. దీంతో శేఖర్రెడ్డి కంపెనీకి పాత లైసెన్సీల నుంచి పోటీ తప్పించాలనేది ప్రభుత్వం ఆలోచన అని అవగతమవుతోంది.