కీచకులు : యువతిని నిర్బంధించి గ్యాంగ్ రేప్.. పది రోజుల పాటు ప్రత్యక్ష నరకం చూపిన కామాంధులు..
ఒంగోలు : పదహారేళ్ల వయసు.. మంచి చెడూ తెలియనితనం. తండ్రి హాస్పిటల్లో సాయంగా ఉన్న సమయంలో ఓ యువకుడితో ఏర్పడిన పరిచయాన్ని ప్రేమనుకుంది. అతని కోసం కన్నవారిని ఉన్న ఊరును వదలుకుంది. ప్రియుడి కోసం ఊరు కాని ఊరు వచ్చి కామాంధుల చేతిలో చిక్కింది. ఆరుగురు కీచకుల కబంధ హస్తాల్లో చిక్కి పది రోజుల పాటు నరకయాతన అనుభవించింది. అదృష్టం కలిసొచ్చి ఎట్టకేలకూ శనివారం వారి చెర నుంచి తప్పించుకుంది. పోలీసుల సాయంతో ఆ కామాంధులను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపింది.
చిన్నారి అత్యాచారంపై అట్టుడుకుతున్న వరంగల్, అధికార పార్టీ ఎమ్మెల్యేకు నిరసన సెగ
ప్రియుడి కోసం ఒంగోలుకు
దాదాపు పది రోజుల క్రితం యువతి ఒంగోలుకు చేరుకుంది. బస్టాండ్లో దిగి రాముకు ఫోన్ చేసింది. అయితే ఫోన్ కలవకపోవడంతో అక్కడే ఎదురుచూసింది. బాలిక బస్సు దిగినప్పటి నుంచి తనను గమనిస్తున్న ఓ దివ్యాంగుడు ఆమె వద్దకు వెళ్లాడు. రాము తనకు తెలుసని నమ్మబలికాడు. మాయమాటలు చెప్పి బాలికను బస్టాండు సమీపంలోని తన గదికి తీసుకెళ్లాడు. అక్కడికి తన స్నేహితున్ని పిలిచి ఇద్దరూ కలిసి ఆ రాత్రి ఆమెపై అత్యాచారం చేశారు.
ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్పగించి
తమ కామవాంఛ తీర్చుకున్న దుర్మార్గులు అంతటితో ఆగలేదు. యువతిని దగ్గరలోని మరో గదికి తీసుకెళ్లి అక్కడున్న నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్పగించాడు. అప్పటి నుంచి ఆ నలుగురు ఆమెకు నరకం చూపారు. వంతులవారీగా అత్యాచారం చేశారు. ఆమె ఎదురు తిరిగితే దివ్యాంగుడితో పాటు నలుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చిత్రహింసలు పెట్టేవారు. పది రోజుల పాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన బాలిక శనివారం అదును చూసుకొని గదిలోంచి బయటపడింది.
నలుగురి అరెస్ట్, పరారీలో ఇద్దరు
కామాంధుల చెర నుంచి బయటపడ్డ యువతి ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుని ఏడుస్తూ కూర్చుంది. అక్కడ పోలీస్ ఔట్ పోస్ట్లో ఉన్న ఓ కానిస్టేబుల్ ఆమెను గమనించి విషయం ఆరా తీశాడు. తనపై జరిగిన దారుణాన్ని యువతి చెప్పడంతో పై అధికారికి సమాచారం ఇచ్చి ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. యువతి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలుసులు ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు. అఘాయిత్యానికి పాల్పడిన దివ్యాంగుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అతనిచ్చిన సమాచారంతో నిందితుల్లో ముగ్గురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.