వైసీపీ కొండపి నియోజకవర్గం మాజీ కోఆర్డినేటర్ అశోక్బాబు పార్టీ నుంచి బహిష్కరణ...కారణం ఇదే!
ఒంగోలు:ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి మాజీ కోఆర్డినేటర్ వరికూటి అశోక్బాబుపై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ఈమేరకు సోమవారం రాత్రి వైసిపి కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది.
పార్టీలో క్రమ శిక్షణ ఉల్లంఘించినందుకు గాను అశోక్బాబుపై వైసిపి అధిష్టానం ఈ వేటు వేసినట్లు సమాచారం. అశోక్ బాబుని గతంలోనే వైసిపి సస్పెండ్ చేసినట్లు ప్రకటించినా...ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నియోజకవర్గం పరిధిలో పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అశోక్ బాబు వరుస పోటీ కార్యక్రమాలు, నేడు కొండపిలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సైతం పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో వైసిపి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
అభ్యర్థుల విజయావకాశాలుపై సర్వే నెపంతో వరికూటి అశోక్ బాబుపై సెప్టెంబర్ 24 తేదీన వైసిపి సస్పెండ్ వేటు వేసింది. అయినప్పటికీ ఆయన కొండపి నియోజకవర్గంలో తనకే పార్టీ శ్రేణుల మద్దతు ఉందంటూ పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం కొండపిలో ఆ నియోజకవర్గ నూతన ఇన్చార్జి వెంకయ్య ఆధ్వర్యంలో వైసిపి కార్యాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరిగాయి.
ఈ కార్యక్రమానికి పార్టీ పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీ మంత్రి బాలినేని, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మరికొందరు పార్టీ ముఖ్యనేతలు హాజరవుతున్నారు. అయితే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా పోటీగా అశోక్బాబు ఇక్కడ మరో పోటీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక వైసిపి నేతలు ఈ విషయం పార్టీ అధిష్టానానికి తెలపడంతో వెంటనే అశోక్ బాబుని పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అందులో అశోక్ బాబుకి వైసిపిలో ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నట్లు సమాచారం.
అయితే వాస్తవంగానే కొండపి నియోజకవర్గంలో చెప్పుకోతగిన స్థాయిలో ప్రజాదరణ కలిగిన అశోక్ బాబు ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారని...స్థానిక టిడిపి ఎమ్మెల్యేకు ప్రజావ్యతిరేకత అనే కోణంలో రెండు పార్టీల మద్దతుదారుల అభిమానం చూరగొనాలనేది ఆయన ప్లాన్ గా తెలుస్తోంది. మరోవైపు ఆయనకు టిడిపి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని ఊహగానాలు వెలువడుతున్నాయి. అశోక్ బాబుపై వైసిపి బహిష్కరణ నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తుపై అతి త్వరలోనే స్పష్టత రావచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.