సింగరాయకొండ అమ్మవారి విగ్రహం ధ్వంసం వార్తలు అవాస్తవం..చర్యలు తీసుకున్న పోలీసులు
సింగరాయకొండ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. విగ్రహాల ధ్వంసంపైనే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ ఆలయం ముఖద్వారంపై ఉన్న స్వామివారి విగ్రహం ధ్వంసం అయ్యిందంటూ పలు మీడియా ఛానెల్స్లో వార్త ప్రచారం అయ్యింది. అయితే ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని తేలింది.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ముఖద్వారం మీద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం పైకి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసరడంతో, విగ్రహంలో చెయ్యి భాగం పాక్షికంగా దెబ్బతిన్నాయంటూ వార్తలు వచ్చాయి. అయితే విచారణ చేసిన పోలీసులు ఇందులో నిజం లేదని నిర్థారించి తప్పుడు కథనాలను ప్రసారం చేసిన మీడియా ఛానెళ్లపై చర్యలు తీసుకున్నారు.
చాలా ఏళ్ల క్రితం లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఆర్చిపై అమ్మవారి విగ్రహాలను సిమెంట్తో ఏర్పాటు చేయడం, అవి పాతబడిపోవడంతోనే పెచ్చులూడి పడిపోయాయని పోలీసులు తెలిపారు. అప్పుడప్పుడు ఈ పెచ్చులు ఊడి పడిపోయేవని ఈ క్రమంలోనే అమ్మవారి విగ్రహంకు ఉన్న కుడి చేయి విరిగిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో విగ్రహ ధ్వంసం అనే సున్నితమైన అంశాన్ని కొందరు అనుకూలంగా మల్చుకుని శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా వ్యవహరిస్తున్నారని పోలీసులు చెప్పారు. అవాస్తవ వార్తలను ప్రసారం చేసి రిపోర్టింగ్ చేసిన మీడియా ప్రతినిధులను అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.