అల్చీమర్స్ వచ్చిందేమో, బాబుపై మోడీకి డౌట్ వచ్చింది, జగన్కు మించిన ఆప్షన్ లేదు: ఆమంచి సంచలనం
హైదరాబాద్/చీరాల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీపై ప్రశంసలు కురిపించారని, కానీ ప్రధానికి పలు అంశాల్లో ముఖ్యమంత్రిపై అనుమానం వచ్చిందని, దీంతో టీడీపీ అధినేత యూటర్న్ తీసుకున్నారని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం ఆమంచి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు కులతత్వంలో ఇరుక్కుపోయారన్నారు. నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. తనకు ప్రత్యర్థి ఉన్నారని ప్రచారం చేయడం కూడా కుట్రే అన్నారు.
చంద్రబాబు చేతిలో ఉన్నట్లుగా నాకు అనిపించదు
డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం రూ.6వేల కోట్లు బాకీ ఉందని ఆమంచి చెప్పారు. ఓట్ల కోసం పసుపు -కుంకుమ అనే పథకాన్ని తీసుకు వచ్చారని, దీనిని అవినీతిమయం చేశారని, ఇలాంటి నీచమైన ఆలోచనలు భరించలేక, దానికి తోడు స్థానికంగా ఉన్న కొన్ని అతీతశక్తుల కారణంగా తాను టీడీపీని వీడవలసి వచ్చిందని చెప్పారు. కొన్ని విషయాలలో ఆలోచిస్తే చంద్రబాబు చేతిలో కూడా ఉన్నట్లుగా తనకు అనిపించదని చెప్పారు. ఇలాంటివి భరించలేక తాను బయటకు వచ్చానని చెప్పారు.
జగన్ను మించిన ఆప్షన్ లేదు
మేమంతా వైయస్ రాజశేఖర రెడ్డిని చాలా దగ్గరగా చూశామని ఆమంచి చెప్పారు. తమకు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గురించి చాలా తక్కువ మాత్రమే తెలుసునని చెప్పారు. కానీ వైయస్ కొడుకు కాబట్టి ఆయన కూడా బాగుంటాడని, నేటికి నేడు.. ఏపీలో జగన్ను మించిన ఆప్షన్ లేదని చెప్పారు. తనలా ఆలోచించే ప్రతి ఒక్కరు జగన్ వెంట నడవాల్సిందేనని చెప్పారు. జగన్ అలా ఉంటాడని, ఇలా ఉంటాడని చెప్పినా.. వంద మంది వంద రకాలుగా చెప్పినా.. మాట తప్పడని మాత్రం చెబుతారని అన్నారు. ఈ విషయంలో జగన్ బెట్టర్ అని నేను భావిస్తున్నానని చెప్పారు.
వైసీపీలోకి పలువురు వస్తారు
తెలుగుదేశం పార్టీ నేతలు తనను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం, ముఖ్యమంత్రి తన చర్చలు సానుకూలంగా ఉండటం ఇవన్నీ వాస్తవమేనని కానీ సమాజం గురించి ఆలోచిస్తే భరించలేక టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చానని చెప్పారు. వైసీపీలోకి పలువురు నేతలు వస్తారని చెప్పారు. కాపు రిజర్వేషన్ల అంశంపై తనకు పెద్దగా అవగాహన లేదని చెప్పారు. కానీ ఏ అంశం కూడా రాజకీయం చేయవద్దనేది తన ఉద్దేశ్యమని చెప్పారు. నేను ఏ అంశంలోను రాజకీయంగా వెళ్లనని చెప్పారు.
షరతుల్లేవు, పవన్ కళ్యాణ్ పిలవలేదు: జగన్తో ఆమంచి భేటీ, కుటుంబంతో సహా..
అల్జీమర్స్ వచ్చాయా అనే అనుమానం
కాపు సభ సందర్భంగా జరిగిన రైలు దగ్ధం కేసులో ముద్రగడ మొదటి ముద్దాయి అయితే తన సోదరుడు అయిదో ముద్దాయి అని ఆమంచి చెప్పారు. కానీ దాంతో తమకు సంబంధం లేదన్నారు. అయినప్పటికీ తప్పుడు కేసు పెట్టారని చెప్పారు. అయినా ఈ కేసులు తమకు లెక్క కాదని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా వంద అంశాలు ఉంటాయని, ఈ రోజు ఒకటి, రేపు ఒకటి, ఈ రోజు చెప్పింది మరిచిపోవాలని, రేపు మరొకటి చెబుతామని, దానిని గుర్తుంచుకోవాలని చెబుతారన్నారు. ఇదేం సిద్ధాంతమని ప్రశ్నించారు. ఆయన తీరు (చంద్రబాబు) చూస్తుంటే డెబ్బై ఏళ్లు వచ్చాయని, అల్జీమర్స్ వచ్చాయా అనే అనుమానం వస్తోందన్నారు.
పిచ్చిపట్టిందని అనుకుంటారు
మనకు ప్రత్యేక హోదా అవసరం లేదని, అసెంబ్లీలో తీర్మానం చేస్తారని, యాభై మందితో పొగిడిస్తారని (బీజేపీని, మోడీని), ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్యాకేజీ చాలునని సన్మానాలు చేస్తారని (బీజేపీ నేతలకు), ఆ తర్వాత మరుసటి నెలలో మార్చివేస్తారని, తన సొంత భయాలను చంద్రబాబు ఇతరులపై రుద్దుతారని విమర్శించారు. ప్యాకేజీ బాగుందని బాగా పొగిడారని చెప్పారు. గత కొన్ని నెలలుగా చంద్రబాబు అవును.. కాదు.. అవును.. కాదు అన్నట్లుగా ఉందన్నారు. ఇలా చేస్తే పిచ్చిపట్టిందని అనుకుంటారా, అల్జీమర్స్ అనుకుంటారా అన్నారు. మనం ఏం చెప్పినా సాగిపోతుందనుకుంటే కుదరదని చెప్పారు.
నెల ముందు జగన్ వైపు ప్రజలు కానీ, పారిపోయి వచ్చారు
విభజన అనంతరం ఏపీని చంద్రబాబుకు అప్పగించడానికి కారణం ఆయన అనుభవజ్ఞుడు అనే కారణంతో అని ఆమంచి చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు నెల రోజుల ముందు కూడా ఏపీ ప్రజలు జగన్ వైపు ఉన్నారని, కానీ ఆ తర్వాత అనుభవజ్ఞుడు అని చంద్రబాబుకు అధికారం ఇచ్చారని చెప్పారు. కానీ ఆయన మాత్రం హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని, పదేళ్ల పాటు హైదరాబాదులో ఉండేందుకు మనం ఫైట్ చేశామని, కానీ ముఖ్యమంత్రి పారిపోయి వచ్చారన్నారు.
చీరాలలో పార్టీ కేడర్ సంబరాలు
ఇదిలా ఉండగా, ఆమంచి తెలుగుదేశం పార్టీని వీడటంతో చీరాలలోని ఆ పార్టీ కేడర్ సంబరాలు జరుపుకుంది. బాణసంచా కాల్చింది. ఆమంచి టీడీపీ నుంచి వెళ్లిపోవడం మంచిదని పేర్కొంది. పార్టీ ఫ్లెక్సీలపై ఆమంచి ఫోటోలు ఉంటే వాటిని తొలగించారు.