చీరాలలో చిరిగిపోయే రాజకీయం..! ఎత్తులకు పైఎత్తు పాలిటిక్స్..!!
చీరాల/హైదరాబాద్ : చీరాలలో ఆమంచి క్రిష్ణమోహన్ రాజకీయ వారసత్వం మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతోంది. అధికారపార్టీ నేతల ఆగడాలకు అడ్డూ.. అదుపూ లేకుండా పోతోంది. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. అధికారపార్టీ నేతలు తాజాగా ఓ హోంగార్డుకు ఫోన్లో వార్నింగ్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుని కుమారుడు రాజేంద్ర.. చీరాల రూరల్ ఈపురుపాలెంకు చెందిన హోంగార్డు రవికుమార్ రెడ్డిని బెదిరించారు. హోంగార్డు రవికుమార్ రెడ్డిని ఫోన్లోనే బండబూతులు తిట్టారు. అన్నా తనకేమి తెలియదని చెబుతున్నా పట్టించుకోకుండా.. నోటితో చెప్పలేని విధంగా బూతుపురాణం అందుకున్నారు. 'నువ్వెంత.. నీ బతుకెంత' అంటూ వార్నింగ్ ఇచ్చారు. బుల్లెట్ బైక్ వేసుకుని తిరిగితే హీరోలు అనుకుంటున్నారా అంటూ హోంగార్డును బెదిరించారు.
అంతే కాకుండా రెండు చేతులూ, రెండు కాళ్లతో సక్రమంగా పనిచేయాలి.. గుర్తుపెట్టుకో, ఎక్కడైనా చక్కగా ఉద్యోగం చేసుకో అని రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. తమ పేర్లు చెప్పడానికి ఎన్ని దమ్ములంటూ రవికుమార్ను హెచ్చరించారు. నిన్న మధ్యాహ్నం 12-20 గంటలకు రాజేందర్ ఫోన్ చేసి హోంగార్డు రవికుమార్ రెడ్డిని బెదిరించారు. ఇటీవల ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆమంచి పిఏ రాంబాబు, రాజేంద్ర డబ్బులు పంచుతూ పోలీసులకు పట్టుపడిన సందర్భంలో వారి పేర్లు చెప్పాలంటూ హోంగార్డు రవికుమార్ మరో వ్యక్తికి చెప్పినట్టుగా తెలియడంతో రాజేందర్ నిన్న హోంగార్డుకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.