ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మహిళలు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు
ప్రకాశం: జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాగలుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
తీవ్రంగా గాయపడిన డ్రైవర్, మరో మహిళను ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, మృతులంతా రాపర్ల సమీప గ్రామాలకు చెందినవారుగా భావిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థినులు కూడా ఉన్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం మిరప కోత పనులకు ట్రాక్టర్పై వెళ్లారు. గురువారం సాయంత్రం మిరప కోత పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. విద్యుత్ తీగలు ట్రాక్టర్పై పడటంతో విద్యుత్ ఘాతంతో తొమ్మిది మంది మహిళా కూలీలు అక్కడికక్కడే చనిపోయారు.
ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్లో మొత్తం 15 మంది ఉన్నట్లు తెలిసింది. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. పనులకు వెళ్లినవారు విగతజీవులుగా మారడంతో వారి కుటుంబంతోపాటు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులను ఆదుకుంటామన్నారు. కాగా, ప్రమాద ఘటనపై మంత్రి బాలినేని శ్రీనివాస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రూ. 5 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.