ఎస్ఈఓ కి అంతుచిక్కని వైరస్ .. ఇదంతా చంద్రబాబు ఎఫెక్ట్ : మంత్రి సురేష్ ఫైర్
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలక్షన్ కమీషన్ వాయిదా వెయ్యటం కరోనాను మించి కలకలం రేపుతుంది. ఈనెల 21 నుంచి ఏపిలో స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉండగా ఏపీలో తాజా పరిస్థితుల నేపధ్యంలో ఊహించని విధంగా ఎన్నికల కమీషన్ ఎన్నికలను వాయిదా వెయ్యటం వైసీపీ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా మారింది . ఇక దీనిపై వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమీషనర్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ఇదంతా చంద్రబాబు కుట్ర అని మండిపడుతున్నారు.
టీడీపీకి పరిటాల ఫ్యామిలీ షాక్ ఇస్తారా ? పరిటాల శ్రీ రామ్ ఏమన్నారంటే!!
రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు అంతుపట్టని వైరస్ సోకిందన్న మంత్రి
ఇక తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు అంతుపట్టని వైరస్ సోకిందని విద్యా శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలను వాయిదా వేయించటం వెనుక పెద్ద కుట్ర ఉందని , టీడీపీ రాష్ట్ర ప్రగతిని అడ్డుకునే క్రమంలోనే ఇదంతా చేశారని ఆరోపించారు. ఎన్నికలను వాయిదా వేయించడం ద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులను అడ్డుకోవాలన్నదే ప్రతిపక్షాల కుట్ర అని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు.
Recommended Video
ఇదంతా చంద్రబాబు ఎన్నికలను ఆపేందుకు చేసిన కుట్ర
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఒక్క కరోనా పాజిటివ్ నమోదు అయ్యిందని, కరోనా వైరస్ను నియంత్రించటానికి , ఎదుర్కోనేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్న ఆయన కావాలనే ఇదంతా చేశారని చెప్పుకొచ్చారు. అసలు పెద్దగా ఏపీలో కరోనా ప్రభావం లేకుండానే ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయాలని రమేష్కుమార్ ఎలా నిర్థారణకు వచ్చారని సురేష్ ప్రశ్నించారు. ఇక ఇదంతా చేసింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు.
వ్యవస్థలను మేనేజ్ చేయటంతో చంద్రబాబు దిట్ట
స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి చంద్రబాబు చేసిన కుట్ర అని పేర్కొన్న మంత్రి సురేష్ ఇక చంద్రబాబుతో పాటు ఎవరెవరు చేతులు కలిపారో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయటంతో చంద్రబాబు దిట్ట అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు . ఎన్నికలు పూర్తి కాకుంటే కేంద్రం నుండి వచ్చే నిధులకు ఆటంకం కలుగుతుందని అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడం వల్ల పేదలు ఇబ్బందులు పడతారని తెలిపారు. ఎన్నికల్లో మరోసారి చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారన్న మంత్రి కరోనాను మించిన అంతు చిక్కని వైరస్ ఎలక్షన్ కమీషనర్ కు సోకిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.