ప్రకాశం వైసీపీలో అధిపత్య పోరు- కరణం, ఆమంచి వర్గాల ఘర్షణలో ఏడుగురికి గాయాలు...
ప్రకాశం జిల్లాలో వైసీపీని బలోపేతం చేసేందుకు అధిష్టానం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నేతల మధ్య వర్గ పోరు మాత్రం ఆగడం లేదు. తాజాగా చీరాల నుంచి వైసీపీకి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే కరణం బలరామ్ వర్గంతో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గానికి జరిగిన దాడుల్లో ఏడుగురు గాయాల పాలయ్యారు. వీరిని స్ధానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వేటపాలెం మండలం రామాపురంలో గ్రామ కాపును ఎన్నుకునే విషయంలో చోటు చేసుకున్న చిన్న తగాదా కాస్తా గాలివానగా మారి ఇరు వర్గాలు బాహాబాహీకి దిగే వరకూ వచ్చింది. బలరాం, ఆమంచి వర్గాల మధ్య జరిగిన ఈ పోరులో ఇరు వర్గాలకు చెందిన ఏడుగురికి గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పాటు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రామాపురం గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.
ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను త్వరలో వైసీపీలోకి చేర్చుకునేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో చీరాల నియోజకవర్గంలో అంతర్గత పోరు అధిష్టానానిని తలనొప్పిగా మారుతోంది. అందులోనూ పార్టీలో రాకముందు నుంచే స్ధానిక నేత ఆమంచితో తలపడుతున్న కరణం బలరాం వైసీపీకి మద్దతు ప్రకటించాక కూడా అదే జోరు కొనసాగిస్తుండటం వైసీపీకి సమస్యగా మారుతోంది.