అత్త సొమ్ము, అల్లుడి సోకు.. స్టైలిష్ బైకు కోసం..!
ప్రకాశం : అల్లుడు ముచ్చట పడ్డాడు. స్టైలిష్ బండిపై మోజు పెంచుకున్నాడు. కొత్త బైకు కొని ఊరేగాలని భావించాడు.. కానీ డబ్బులు లేవు. ఆ క్రమంలో సొంత మేనత్తనే టార్గెట్ చేశాడు. ఆమెకు తెలియకుండా ఏటీఎం కార్డు ఎత్తుకెళ్లి తాను ఇష్టపడ్డ, మనసుపడ్డ బైకు కొనేశాడు. దాని మీద దోస్తులతో కలిసి షికార్లు కొట్టాడు. చివరకు ప్లాన్ బెడిసి కొట్టింది. ఏటీఎం కార్డు పోయిందని గుర్తించిన అతడి మేనత్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అల్లుడి గుట్టు రట్టైంది.
కందుకూరు కోటకట్ట వీధికి చెందిన పాలేటి హైమావతికి చెందిన ఏటీఎం కార్డును ఆమె మేనల్లుడు శబరీష్ అలియాస్ సాయి అలియాస్ అన్వీ కుమార్ దొంగిలించాడు. స్టైలిష్ బైకు కొనుక్కోవాలని ఆరాట పడుతూ ఆమె ఏటీఎం కార్డును కాజేశాడు. అప్పటికే ఆ కార్డుకు సంబంధించి పిన్ నెంబర్ అతడికి తెలుసు. దాంతో అతని ప్లాన్ మరింత ఈజీ అయింది.
అత్యాచారం
కేసులో
గ్రామ
పెద్దల
పైశాచికత్వం..
బాధితురాలికే
గుండు
గీయించిన
వైనం..!
ఏటీఎం కార్డు దొంగిలించాక.. తన స్నేహితులైన గుర్రం సిద్ధార్థ, ఇండ్ల ప్రవీణ్, దేవర్ల సాయి కుమార్తో కలిసి సింగరాయకొండకు వెళ్లాడు శబరీష్. అక్కడ ఏటీఎం నుంచి 48 వేల రూపాయలను డ్రా చేశారు. అనంతరం నెల్లూరు వెళ్లి తనకు ఇష్టమైన కెటిఎం డుకే - 2000 బైకు కొన్నాడు. షోరూమ్లో మరో 70 వేలు కార్డు స్వైప్ చేసి చెల్లించాడు.
మొత్తానికి మేనత్త ఏటీఎం కార్డు దొంగిలించి తాను మనసుపడ్డ బైకు కొనేశాడు శబరీష్. అయితే ఇటీవల ఏటీఎం కార్డు పోయిందని గుర్తించిన హైమావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కంప్లైంట్ మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు మేనల్లుడి నిర్వాకమని తేల్చారు. దాంతో శబరీష్తో పాటు అతడికి సహకరించిన ముగ్గురు స్నేహితులను అరెస్ట్ చేశారు. శబరీష్ నుంచి బైకుతో పాటు 25 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నలుగురిలో ఇద్దరు మైనర్లు కావడంతో వారిని జువైనల్ కోర్టుకు పంపించారు. మరో ఇద్దరిని స్థానిక కోర్టులో హాజరు పరిచారు.