టీడీపీలో మరో వికెట్ డౌన్..? సీఎం జగన్ను కలిసిన ఎమ్మెల్సీ..
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఇప్పటికే టీడీపీకి దూరమైన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నట్టు కనిపిస్తున్నారు. బుధవారం మండలిలో రూల్.71పై వైసీపీకి అనుకూలంగా ఓటేసి టీడీపీకి షాక్ ఇచ్చిన సునీత.. తాజాగా వైఎస్ జగన్తో భేటీ అయి పార్టీకి దూరమవుతున్న సంకేతాలు ఇచ్చారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం పోతుల సునీత మీడియాతో మాట్లాడారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరడానికే సీఎం జగన్ను కలిశానని స్పష్టం చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడిన సునీత.. రాష్ట్ర అభివృద్ది పరిపాలన వికేంద్రీకరణతోనే సాధ్యమని అన్నారు.
మండలిలో బుధవారం చోటు చేసుకున్న పరిణామాలు బాధాకరం అన్నారు. దేశం మొత్తం ఆ ఘటనను గమనించిందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే బిల్లులను మండలిలో అడ్డుకున్నారని, మండలి ఛైర్మన్ హోదాలో ఉన్న షరీఫ్ టీడీపీ కార్యకర్త వ్యవహరించారని మండిపడ్డారు.అంతేకాదు, మండలి రాష్ట్ర అభివృద్దికి ఆటంకంగా మారిందని.. అది ఉండాలా వద్దా అన్న అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.
నియోజకవర్గ నిధుల కోసమే సీఎంను కలిసినట్టు చెప్పినప్పటికీ.. సునీత టీడీపీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు.. ఆమె పార్టీకి దూరమవుతున్నారనే సంకేతాలను స్పష్టం చేస్తున్నాయి. దీంతో మండలిలో టీడీపీ సంఖ్యాబలం పడిపోనుంది. ఇప్పటికే డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా.. శివనాథ్ రెడ్డి కూడా మండలి ఓటింగ్లో వైసీపీకి అనుకూలంగా ఓటేశారు. ఓటింగ్ సందర్భంగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు శత్రుచర్ల,శమంతకమణి హాజరుకాలేదు. వీరు పార్టీకి దూరంగా ఉండదలుచుకున్నారా.. లేక పార్టీతో కొనసాగదులుచుకున్నారా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.