Pothula Sunitha: 24 గంటలు కూడా గడవకముందే: వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ?
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు పోతుల సునీత కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై శాసన మండలిలో చర్చించడానికి ప్రవేశపెట్టిన రూల్ 71 తీర్మానానికి ప్రతికూలంగా ఓటు వేసి.. 24 గంటలు కూడా గడవక ముందే- ఆమె మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యారు. తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం చూసుకున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో..
పోతుల సునీత.. అధికార వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని అంటున్నారు. శాసనసభ, శాసన మండలి లాబీల్లో దీనిపై జోరుగా చర్చ సాగుతోంది. బుధవారమే ఆమె ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో.. వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారని చెబుతున్నారు. శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ సంఖ్యాబలం లేదు. ఈ పరిస్థితుల్లో టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్సీ.. అధికార పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన బలాన్ని పెంచుకోవడంలో భాగంగానే వైఎస్ఆర్సీపీ ఈ నిర్ణయాన్ని తీసుకుందని అంటున్నారు.
రాజీనామా చేసిన తరువాతే..
తమ పార్టీలోకి చేరదలిచిన ఎమ్మెల్యేలు గానీ, ఎమ్మెల్సీలు గానీ.. తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందంటూ వైఎస్ జగన్.. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటించారు. దీనికి అనుగుణంగానే నడుచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పోతుల సునీత తన పదవికి రాజీనామా చేస్తారా? లేక టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, మద్దాలి గిరిధర్ రావు తరహాలో ప్రత్యేక సభ్యురాలిగా ఉంటారా? అనేది తేలాల్సి ఉంది. రాజీనామా చేసిన తరువాతే.. పోతుల సునీతను పార్టీలోకి చేర్చుకుంటామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇదివరకు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా చేసిన తరువాతే వైఎస్ఆర్సీపీలో చేర్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.