టీడీపీకి మాజీ మంత్రి గుడ్బై: మరి కాస్సేపట్లో జగన్ సమక్షంలో: కుమారుడితో సహా వైసీపీలోకి..
ఒంగోలు: అంచనాలు నిజమయ్యాయి.. ఊహాగానాలు వాస్తవరూపం దాల్చాయి. అందరూ అనుకున్నట్టే- తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు సోమవారం పార్టీకి రాజీనామా చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువాను కప్పుకోనున్నారు. తన కుమారుడు శిద్ధా సుధీర్ కుమార్తో కలిసి వైసీపీ తీర్థాన్ని పుచ్చుకోనున్నారు.
టీడీపీలో భూకంపం: వైసీపీలోకి మాజీమంత్రి శిద్ధా రాఘవరావు కూడా సిద్ధమా?: మంత్రి బాలినేనితో టచ్లో.. !
కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే..
గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన శిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్ కుమార్ ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఒంగోలు లోక్సభ స్థానం నుంచి రాఘవరావు, కనిగిరి అసెంబ్లీ సీటు నుంచి సుధీర్ కుమార్ పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థుల చేతుల్లో పరాజయాన్ని చవి చూశారు. అనంతరం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడం..కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
చక్రం తిప్పిన బాలినేని, మాగుంట..
శిద్ధా రాఘవరావు కొద్ది రోజులుగా విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఒంగోలు లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డితో మంతనాలు సాగిస్తూ వచ్చారు. పార్టీలో చేరిన తరువాత తనకు గానీ, తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు గానీ ఎలాంటి ఇబ్బందులు ఉండబోవనే భరోసా లభించడంతో ఇక ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నారు. శిద్ధా సుధీర్తో కలిసి వైసీపీలో చేరడానికి సమాయాత్తమౌతున్నారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన శిద్ధా రాఘవరావును ఒప్పించడంలో మంత్రి బాలినేని, ఎంపీ మాగుంట చక్రం తిప్పినట్లు చెబుతున్నారు.
చంద్రబాబే బుజ్జగించినా..
శిద్ధా రాఘవరావు అన్న కుమారుడు హనుమంత రావు ఆదివారమే వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. మంత్రి బాలినేనిని కలిసి ఆ పార్టీ కండువాను కప్పుకొన్నారు. హనుమంత రావు వైసీపీలో చేరిన 24 గంటల వ్యవధిలోనే శిద్ధా రాఘవరావు కూడా పార్టీ ఫిరాయించడం ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలను పుట్టించింది. ఆయనను బుజ్జగించడానికి స్వయంగా చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగినప్పటికీ.. ఫలితం లేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వైసీపీలో చేరబోతున్నారనే వార్తలను తోసిపుచ్చిన రెండు రోజుల్లోనే..
శిద్ధా రాఘవరావు టీడీపీకి గుడ్బై చెప్పబోతున్నారని, త్వరలోనే ఆయన వైసీపీలో చేరుతారంటూ కొద్దిరోజుల కిందటే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో- చంద్రబాబు ఆయనను ఉండవల్లికి పిలిపించుకున్నారు. పార్టీ వీడటానికి గల కారణాలపై ఆరా తీశారు. శిద్ధాకు గ్రానైట్ సంస్థలు ఉన్నాయి. తన వ్యాపార కార్యకలాపాలతో పాటు, కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని ఆయన చంద్రబాబును కోరగా.. ఎలాంటి హామీ ఇవ్వలేదని చెబుతున్నారు. దీనితో పార్టీ ఫిరాయించాలని నిర్ణయించుకున్నారు. తాను వైసీపీలో చేరబోతున్నానంటూ వచ్చిన వార్తలు స్వయంగా శిద్ధా రాఘవరావే తోసిపుచ్చారు. అది జరిగిన మూడోరోజే వైసీపీలో చేరబోతున్నారు.