పరారీలతో టెన్షన్ ... ఒంగోలు రిమ్స్ నుండి ఢిల్లీ తబ్లిఘీ జమాత్ సభ్యుడు పరారీ
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికి ఏపీలో 161 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక చాలా మంది ఢిల్లీలో జరిగిన తబ్లిఘి జమాత్ మత ప్రచార సభకు వెళ్లి వచ్చిన వారే కావటంతో ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా మారింది . ఇక ఇదే సమయంలో ఆస్పత్రుల నుండి పారిపోయిన వాళ్ళు ఏపీ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా మారుతున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో రిమ్స్ ఐసొలేషన్ వార్డు నుంచి కరోనా లక్షణాలున్న యువకుడు తప్పించుకుపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.తబ్లీఘీ జమాత్ మత ప్రచార సభకు వెళ్లి వచ్చిన యువకుడు దగ్గు, జలుబు లక్షణాలతో నిన్న ఆస్పత్రికి వచ్చాడు .ఇక ఆ యువకుడిని వైద్యులు ఐసొలేషన్లో ఉంచారు. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి శాంపిళ్లను లాబొరేటరీకి పంపించారు. అయితే ఆ ఫలితాలు రాకముందే భయంతో ఈ ఉదయం నుంచి యువకుడు కనిపించకుండా పోయాడు. దీంతో అతని కోసం గాలిస్తున్నామని, భయపడాల్సిన పనిలేదని సూపరింటెండెంట్ పేర్కొన్నారు .
ఆయనకు కరోనా లక్షణాలున్నాయని , ఆయన తబ్లీఘీ జమాత్ వెళ్లి వచ్చిన నేపధ్యంలో దాదాపు కరోనా కన్ఫార్మ్ అయ్యే పరిస్థితి ఉంది . ఇక ఈ సమయంలో అతను పారిపోవటంతో టెన్షన్ మొదలైంది . ఫోన్ చేసినప్పటికీ కలవట్లేదని స్విచాఫ్ అని వస్తున్నట్లు అధికారులు చెప్తున్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పరారైన వ్యక్తి ఢిల్లీలో జరిగిన తబ్లీఘీ జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఒంగోలు రిమ్స్లో ఇలానే కరోనా లక్షణాలున్న ఓ వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడ్ని వెంటనే గమనించిన ఆస్పత్రి సిబ్బంది పట్టుకుని వార్డుకు తరలించారు. ఇప్పుడు మళ్లీ మరో వ్యక్తి పారిపోవడం కలకలం రేపుతుంది .