పాకిస్తాన్ టూర్కు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు: 16 ఏళ్ల తరువాత తొలిసారిగా: స్పెషాలిటీ ఇదే
లండన్: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించబోతోంది. సుదీర్ఘ విరామం తరువాత పాకిస్తాన్ జట్టులో పర్యటించబోతోంది. 16 సంవత్సరాల తరువాత ఇంగ్లాండ్ టీమ్.. పాకిస్తాన్లో పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. పాకిస్తాన్ పర్యటన ముగించుకున్న తరువాత ఆ రెండు జట్లూ భారత్కు బయలుదేరుతాయి. భారత్లో జరిగే టీ20 ప్రపంచకప్లో పాల్గొంటాయి.
ఈ పర్యటన ఇప్పుడే కాదు. ఇది కార్యరూపం దాల్చడానికి ఇంకో ఏడాది కాలం పడుతుంది. వచ్చే ఏడాది అక్టోబర్లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తుంది. రెండు రోజుల్లో రెండు టీ20 మ్యాచ్లను మాత్రమే ఆడుతుంది. అక్టోబర్ 14, 15 తేదీల్లో ఈ రెండు మ్యాచ్లను షెడ్యూల్ చేసినట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. బ్యాక్ అండ్ బ్యాక్ టీ20 మ్యాచ్లకు కరాచీ స్టేడియం వేదిక కానుంది. రెండు రోజుల్లో రెండు మ్యాచ్లను ఆడిన తరువాత.. ఇంగ్లాండ్, పాక్ జట్లు భారత్కు బయలుదేరుతాయి.
ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటించడం 16 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. ఆ జట్టు చివరిసారిగా 2005లో పాక్లో పర్యటించింది. మూడు టెస్టులు, అయిదు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లల్లో పాకిస్తాన్ జట్టును ఢీ కొట్టింది. అప్పటి ఇంగ్లాండ్ టీమ్కు మైకెల్ వాన్ సారథ్యాన్ని వహించారు. తాజాగా ప్రతిపాదించిన రెండు టీ20 మ్యాచ్ల షార్ట్ టూర్.. విజయవంతమైతే.. ఆ మరుసటి ఏడాదిలో మరిన్ని దేశాలకు చెందిన క్రికెట్ జట్లు తమ దేశ పర్యటనకు వస్తాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంచనా వేస్తోంది.
ఉగ్రవాద దేశంగా, క్రికెట్ ఆడటానికి వెళ్లే విదేశీ జట్లకు ఏ మాత్రం భద్రత లేని దేశంగా పాకిస్తాన్కు పేరున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన అనంతరం ఏ అంతర్జాతీయ క్రికెట్ జట్టు కూడా పాకిస్తాన్లో పర్యటించే సాహసం చేయలేకపోయింది. ఆ పరిస్థితులు ఇప్పుడిప్పుడే మారుతున్నాయి. కొద్దిరోజుల కిందటే- జింబాబ్వే జట్టు.. పాకిస్తాన్లో పర్యటించింది.
ఐపీఎల్ తరహాలో పాకిస్తాన్లో నిర్వహిస్తోన్నపాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచుల్లో పలువురు విదేశీ క్రికెటర్లు భాగస్వామ్యులు అయ్యారు. ఫలితంగా- మునుపటి ఉద్రిక్త పరిస్థితులు తమ దేశంలో లేవనే సందేశాన్ని పంపించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీనికి అనుగుణంగా ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్.. ఓ షార్ట్ టూర్ను ప్లాన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.