క్వారంటైన్లోకి పుజారా, హనుమ విహారి: రవిశాస్త్రి సహా కోచింగ్ స్టాఫ్ మొత్తం: ఆ టూర్కు ముందు
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ జోరుగా సాగుతోంది. మ్యాచ్లు నడుస్తున్న కొద్దీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. మొన్నటిదాకా ఈ సీజన్లో వెనుకంజలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ సింహాలు ఒక్కసారిగా జూలు విదిల్చడం, శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని ఢిల్లీ కేపిటల్స్ వరుసగా భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంటుండటం, సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటిదాకా తన సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడకపోవడం వంటి పరిణామాలు ఐపీఎల్-2020ని రసవత్తరంగా మార్చేసింది. మున్ముందు మరింత హోరాహోరీ పోరు తప్పదనే అభిప్రాయాన్ని కల్పిస్తోంది.
ఐపీఎల్ ముగిసిన తరువాత టీమిండియా షెడ్యూల్ ఏంటీ?
ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత మరో ఆసక్తికరమైన సిరీస్ ఆరంభం కాబోతోంది. భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. వచ్చేనెల 10వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లబోతోంది. అది వైట్ బాల్ సిరీస్. మూడు టెస్టులు, మూడు వన్డే, మూడ టీ20 మ్యాచ్లను ఆడుతుంది కోహ్లీ టీమ్. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల సుదీర్ఘకాలం పాటు సిరీస్లకు బ్రేక్ పడిన తరువాత.. టీమిండియా పర్యటించబోయే మొట్టమొదటి టూర్ ఇది.
బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్..
ప్రస్తుతం ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఐపీఎల్ తరహాలోనే ఆస్ట్రేలియా టూర్ను కూడా బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్లో ఉండేలా ప్లాన్ చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. బయో బబుల్ విధానాన్నే అక్కడా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. క్రికెటర్లు కరోనా వైరస్ బారిన పడకుండా అన్ని ముందు జాగ్రత్తలను తీసుకుంటోంది. చిన్న సవరణలను ప్రతిపాదించింది. 14 రోజుల క్వారంటైన్ కాలాన్ని ఆరు రోజులకు కుదించే అవకాశాలు లేకపోలేదు.
నో ఫ్లయిట్.. ఓన్లీ ఛార్టెడ్
టీమిండియా క్రికెటర్లు కోచ్, సపోర్టింగ్ స్టాఫ్ సంఖ్యను బీసీసీఐ తగ్గించింది. జట్టుతో పాటు 22 నుంచి 25 మంది మాత్రమే జట్టు వెంట ఉండేలా సన్నాహాలు చేస్తోంది. విమానం ద్వారా ప్రయాణించడం వల్ల ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడే అవకాశం లేదని భావిస్తోన్న బీసీసీఐ.. ఛార్టెడ్ ప్లయిట్ ద్వారా మాత్రమే వారిని ఆస్ట్రేలియాకు తీసుకెళ్తుందని తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయిన తరువాత.. ఆ దేశ క్రికెట్ బోర్డు నిబంధనలను అనుసరిస్తూనే బయో బబుల్ సెక్యూర్ను కొనసాగిస్తుంది బీసీసీఐ.
టెస్ట్ ప్లేయర్లతో పాటు
టెస్ట్ ప్లేయర్లు చేతేశ్వర్ పుజారా, హనుమ విహారిలను ఆరు రోజుల పాటు క్వారంటైన్లోకి పంపించబోతోంది. టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కోచింగ్ స్టాఫ్ భరత్ అరుణ్, విక్రమ్ రాథోడ్, ఆర్ శ్రీధర్ సహా ఇతర సభ్యులకు ఆరు రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది. వారంతా ఈ నెలాఖరులోగా దుబాయ్కి చేరుకోవచ్చని చెబుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. కరోనా వైరస్ పరీక్షలను కూడా నిర్వహిస్తారు. కరోనా వైరస్ నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తరువాతే వారంతా దుబాయ్కు బయలుదేరి వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు.