వైసీపీలోకి దగ్గుబాటి: హితేష్కు ఆదిలోనే షాక్, ఎన్నికల్లో పోటీకి అదే అడ్డంకి, పౌరసత్వం రద్దయితేనే
Recommended Video
అమరావతి/హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావుల తనయుడు దగ్గుబాటి హితేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పర్చూరు నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అయితే పోటీకి ముందే ఆయనకు షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు.
హితేష్కు కొత్త చిక్కు
వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గుబాటి హితేశ్ను ప్రకాశం జిల్లాలోని పర్చూరు నుంచి పోటీ చేయిస్తారని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. తాజాగా ఆదివారం జగన్ను కలిసి పర్చూరు టిక్కెట్ కోరారని తెలుస్తోంది. అయితే పోటీకి ఆయనకు చిక్కు వచ్చి పడింది. ఆయనకు అమెరికా పౌరసత్వం ఉంది. గతంలో తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ నుంచి పోటీ చేసిన చెన్నమనేనికి కూడా ఇలాంటి చిక్కు వచ్చింది. ఆయన గెలిచాక ప్రత్యర్థి కోర్టుకు వెళ్లారు.
అమెరికా పౌరసత్వం
హితేశ్కు అమెరికా పౌరసత్వం ఉంది. నిబంధనల ప్రకారం విదేశీ పౌరసత్వం ఉన్నవారు భారత ఎన్నికల్లో పోటీ చేయడం కుదరదు. ఈ నేపథ్యంలో అమెరికా పౌరసత్వం రద్దు హితేష్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్నారట. ఈ పౌరసత్వం రద్దయిన వెంటనే హితేశ్ తన తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి వైసీపీలో చేరనున్నారని అంటున్నారు. రద్దు గురించి ఓ క్లారిటీ వచ్చినా చేరుతారు.
పురంధేశ్వరికి బీజేపీ పెద్దలు చెప్పారు: వైసీపీలోకి దగ్గుబాటి-కొడుకు హితేష్, జగన్ హామీలు
రద్దు కాకుంటే బరిలో వెంకటేశ్వర రావు
ఒకవేళ నిర్ణీత సమయంలోగా పౌరసత్వం రద్దుకాకుంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావే పోటీలోకి దిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. మరో కొద్ది రోజుల్లో అమెరికా పౌరసత్వంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
బీజేపీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి
ఇదిలా ఉండగా, తాను పార్టీ మారుతాననే ప్రచారాన్ని పురంధేశ్వరి కొట్టి పారేశారు. బీజేపీ అధిష్ఠానం ఎక్కడి నుంచి పోటీచేయమన్నా చేస్తానని స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదన్నారు. పార్టీ మారుతున్నట్టు వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. 2014 ఎన్నికల్లో కడప జిల్లా రాజంపేట లోకసభ నియోజకవర్గం నుంచి పురందేశ్వరి పోటీ చేశారు.