పులివెందులలో సీబీఐ దర్యాప్తు- వివేకా కుటుంబ సభ్యుల వాంగ్మాలం సేకరణ..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నాలుగో రోజుకు చేరుకుంది. ఇప్పటికే మూడురోజులుగా పులివెందులలో మకాం వేసిన సీబీఐ అధికారుల బృందం.. పలువురు ముఖ్య సాక్ష్యులను విచారించింది. ఇవాళ వివేకా నివాసానికి వెళ్లిన సీబీఐ బృందం... ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించింది. వీరి నుంచి హత్యకు సంబంధించిన పలు వివరాలను రాబట్టింది. వివేకా హత్యకు సంబంధించి కుటుంబ సభ్యుల్లో ఉన్న అనుమానాలను సీబీఐ బృందం తెలుసుకునే ప్రయత్నం చేసింది.
వివేకా ఇంటికి వెళ్లిన సీబీఐ బృందం.. సర్వేయర్ తో కొలతలు వేయించడమే కాకుండా ఆయన భార్య సౌభాగ్యమ్మను అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. వివేకా హత్యకు గురైన బాత్ రూమ్, బెడ్ రూమ్ లను సీబీఐ అధికారులు పరిశీలించారు. మరికొన్ని రోజులు అక్కడే మకాం వేసి కీలక ఆధారాలు సేకరించాలని సీబీఐ బృందం భావిస్తోంది. దీంతో వివేకా హత్య జరిగినప్పుడు స్ధానికంగా ఉన్న పోలీసు అధికారులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులను కూడా విచారించే అవకాశాలున్నాయి.
అదే సమయంలో సీబీఐ బృందం వివేకా హత్యపై గతంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు నియమించిన సిట్ బృందాల నివేదికలను పరిశీలిస్తోంది. ఇందులో ఏదైనా ముఖ్యమైన సమాచారం కానీ, క్లూలు కానీ దొరకవచ్చని సీబీఐ భావిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు మార్చి నెలలో వివేకా హత్య జరగ్గా.. అప్పట్లో విపక్షంలో ఉన్న జగన్ సీబీఐ విచారణ కోరారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మౌనం వహించడంతో కుటుంబ సభ్యులతో పాటు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ రంగంలోకి దిగింది.