వివేకా హత్య కేసు: పులివెందులలో సీబీఐ దర్యాప్తు, ఇంటిపైకెక్కి పరిశీలన
కడప: పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఛేదించడానికి సీబీఐ మరోమారు ఆయన నివాసాన్ని పరిశీలించింది. పదిమందికిపైగా సీబీఐ అధికారులు వివేకా హత్య జరిగిన ప్రదేశంలో ప్రతి అణువూ పరిశీలించారు.
పులివెందుల టౌన్ ప్లానింగ్ అధికారులు, సర్వేయర్లతో ఇంటి మ్యాప్ను సీబీఐ అధికారులు తయారు చేస్తున్నారు. వివేకా ఇంటి పరిసర ప్రాంతాలన్నింటినీ ఆమె కుమార్తె సునీత దగ్గరుండి సీబీఐ అధికారులకు చూపించారు.
వివేకా హత్య జరిగిన సమయంలో ఓ గది తలుపులు తెరుచుకుని ఉన్న విషయాన్ని సునీత సీబీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హత్య జరిగిన పడకగది, స్నానపు గదిని పరిశీలించారు. అంతేగాక, ఇంటిపైకెక్కి కూడా అధికారులు నిశితంగా పరిశీలించారు. వివేకా హత్య జరిగిన సమయంలో ఇంటి బయట నిద్రించిన వాచ్మెన్ రంగన్నను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15న హత్య చెయ్యబడ్డారు. వివేకాను దుండగులు తన సొంత ఇంట్లోనే అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఈ కేసు దర్యాప్తు విషయంలో రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్, వివేకా కూతరు సునీతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సీబీఐకి ఈ దర్యాప్తును అప్పగిస్తూ వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. కానీ, వైసీపీ నేతల పేర్లు చెబుతూ వైఎస్ వివేకా కూతురు సునీత మాత్రం సీబీఐ దర్యాప్తు కావాలని కోర్టును కోరింది. కేసు పురోగతిని పరిశీలించిన కోర్టు.. సీబీఐ దర్యాప్తును అప్పగించింది.
Recommended Video
ఈ క్రమంలో వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. హత్య జరిగిన రోజు వివేకా ఫోన్కు ఎవరి వద్ద నుంచి కాల్ వచ్చాయి, ఆయన ఎవరికి ఫోన్ చేశారో పూర్తి డేటాను సేకరిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు, స్థానికులతో సమాచారాన్ని సేకరించడంతోపాటు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీబీఐకి అప్పగించే నాటికే పోలీసులు 1300 మంది అనుమానితులను విచారించారు.