ప్రభాస్ ఇష్యూ: షర్మిల ఫిర్యాదుతో కేసు నమోదు, రంగంలోకి ప్రత్యేక దర్యాఫ్తు బృందం
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల ఫిర్యాదు పైన సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. దర్యాఫ్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అదనపు డీసీపీ రఘువీర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం పని చేయనుంది.
షర్మిల ఆదివారం ఉదయం హైదరాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోలీస్ కమిషనర్ కార్యాలయం దీనిని సైబర్ సెల్కు పంపించింది. దర్యాఫ్తు చేయాలని ఆదేశించారు. దీంతో కేసు నమోదు చేసి, దర్యాఫ్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు, షర్మిలపై పోస్టులను సీపీఐ ఖండించింది. మహిళలను అగౌరవపరిచేలా ప్రవర్తించడం తగదని చెప్పారు. నిందితుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రాథమిక సమాచారం తెప్పించుకొని కేసు
ఫిర్యాదు తమ వద్దకు రాగానే సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమికంగా కొంత సమాచారం తెప్పించుకొని, కేసు నమోదు చేసారు. కేసులో పరువు నష్టం లేదా అభ్యంతరకర వ్యాఖ్యలు లేదా కావాలని ఉద్దేశ్యపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కావొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ప్రస్తుతానికి గుర్తు తెలియని వ్యక్తుల మీద కేసు నమోదు చేశారు. ఆమె పైన కామెంట్స్ ఎక్కడి నుంచి మొదలయ్యాయనే కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేయనున్నారు. ఈ కేసును రెండు ప్రత్యేక బృందాలు దర్యాఫ్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రభాస్ ను ఎప్పుడూ కలవలేదు, అసలు లక్ష్యం ఆ పార్టీ వారేనా : షర్మిళ ఫిర్యాదు కలకలం ..!
పలు సెక్షన్ల కింద కేసు
2014లోను ప్రభాస్, షర్మిలల పైన కొందరు విపరీత కామెంట్లు, కథనాలు వచ్చాయి. దీనిపై ఆ ఎన్నికల తర్వాత కూడా షర్మిల ఫిర్యాదు చేశారు. మళ్లీ ఇటీవల గత ఆరు నెలల కాలంలో మరోసారి తెర పైకి తెచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల సీపీ అంజనీ కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
సీరియస్గా తీసుకున్న వైసీపీ
షర్మిలపై చేస్తున్న ఆరోపణలను వైసీపీ సీరియస్గా తీసుకుంది. దీంతో తనపై వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలని షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు సీపీని కలిసిన షర్మిళ మాట్లాడుతూ... తాను మౌనంగా ఉంటే ఇదే నిజమనుకునే ప్రమాదముందని, ఈ తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకే సీపీని కలిశానని చెప్పారు. తన నైతికత, నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, కానీ తన గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. ప్రభాస్ అనే వ్యక్తిని తన జీవితంలో ఎప్పుడూ కలవలేదని, పుకార్లు పుట్టించి వ్యక్తిత్వాన్ని చంపడం దారుణమన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని తన పిల్లలపై ప్రమాణం చేసి చెబుతున్నానని, తనపై ఆరోపణలు చేసిన వారు కూడా వారి పిల్లలపై ప్రమాణం చేసి అవి కరెక్ట్ అని చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ దుష్ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందన్నారు. పుకార్లు పుట్టించడం టీడీపీకి కొత్త కాదని, అబద్దాన్ని వందసార్లు చెప్పి నిజం చేయడం టీడీపీ సిద్ధాంతమన్నారు. చంద్రబాబు డిక్షనరీలో విలువలు, నైతికత అనే పదాలు లేన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం అంటూ డైలాగులు చెప్పే టీడీపీ నేతలకు ఆత్మగౌరవం ఉందో లేదో చెప్పాలన్నారు. చంద్రబాబు ఇంట్లో మహిళలు లేరా, మేం దుష్ప్రచారం చేయలేమా, మాకు ఆ తెలివి లేదా, కానీ మాకు విలువలు ఉన్నాయి కాబట్టి ఆ పని చేయడం లేదన్నారు. ఇది తన వ్యక్తిగత విషయంగా చూడకుండా మహిళల ఆత్మగౌరవంగా చూడాలని సీపీని కోరినట్లు చెప్పారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారన్నారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేకే హైదరాబాద్ వచ్చానని చెప్పారు.