Kakinada Jntu : జేఎన్టీయూలో కరోనా కలకలం... గర్ల్స్ హాస్టల్లో 15 మందికి పాజిటివ్...
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ గర్ల్స్ హాస్టల్లో 15 మంది అమ్మాయిలు కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. వీరందరినీ ఐసోలేషన్ సెంటర్లకు తరలించినట్లు సమాచారం. హాస్టల్లో ఒకేసారి ఇంతమందికి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడి హాస్టల్లో సుమారు 400 మంది విద్యార్థినులు ఉంటున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం స్థానిక వైద్యాధికారులు వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో కరోనా కేసుల విషయానికి వస్తే ఆదివారం(అగస్టు 1)తో పోలిస్తే సోమవారం(అగస్టు 2) కేసుల సంఖ్య భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ఆదివారం కొత్తగా 2287 పాజిటివ్ కేసులు నమోదవగా.. సోమవారం 1546 కేసులు మాత్రమే నమోదయ్యాయి. టెస్టుల సంఖ్య కూడా ఆదివారంతో పోలిస్తే పోమవారం తగ్గింది. ఆదివారం నాటి రిపోర్ట్లో 80వేల పైచిలుకు టెస్టులు చేసినట్లు వెల్లడించగా... సోమవారం నాటి రిపోర్ట్లో కేవలం 59,641 టెస్టులు చేసినట్లు వెల్లడించారు.
సోమవారం నాటి రిపోర్ట్ ప్రకారం... రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,70,008కి చేరింది. మరో 15 మంది మృతి కరోనాతో మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 13,410కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతి చెందగా, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1,968 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 19,36,016కి చేరింది. రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం 20,582 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,47,08,540 కరోనా నమూనాలను పరీక్షించారు.
జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 18, చిత్తూరులో 229, తూర్పుగోదావరిలో 416, గుంటూరులో 90, కడపలో 115, కృష్ణాలో 158, కర్నూలులో 43, నెల్లూరులో 151, ప్రకాశంలో 201, శ్రీకాకుళంలో 22, విశాఖపట్నంలో 54, విజయనగరంలో 07, పశ్చిమగోదావరిలో 42 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు అత్యధికంగా తూర్పుగోదావరిలో 2,78,204, చిత్తూరులో 2,31,604 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(81,483) కరోనా కేసులున్నాయి.