ప్రాణం తీసిన ‘టిక్టాక్’: కువైట్లో తెలుగు యువకుడి ఆత్మహత్య
అమరావతి: సరదా వీడియోల సోషల్ మీడియా యాప్ 'టిక్టాక్' మరొకరి ప్రాణం తీసింది. తన తోటివారే లేని ఆరోపణలు చేస్తూ ఓ వీడియో చేసి ఆ యాప్లో పోస్టు చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది. దీంతో దాన్ని అవమానంగా భావించిన ఓ తెలుగు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కువైట్లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడుకు చెందిన పుచ్చకాయల మోహన్ కుమార్(30) . ఉపాధి కోసం అతడు రెండేళ్ల క్రితం కువైట్ వెళ్లాడు. అక్కడే ఓ ఐరన్ షాపులో పనిచేస్తున్నాడు. తన తోటివారితోనే ఓ గదిలో కలిసి ఉంటున్నాడు.
కాగా, ఓ వ్యక్తి వద్ద స్నేహితుల భాగస్వామ్యంతో చీటి కడుతున్నాడు. దాన్ని ఇటీవల పాడుకున్నాడు. స్నేహితులను డబ్బు ఇవ్వకుండా మొత్తం తీసుకుని కనిపించకుండా పోయాడంటూ అతని సహచరులు కొందరు మోహన్ కుమార్ ఫొటోలతో ఓ వీడియో తయారు చేశారు.
ఆ వీడియోను టిక్టాక్లో అప్లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసిన మోహన్ కుమార్ తీవ్ర మనస్తాపానికి గురై నవంబర్ 3న తను ఉంటున్న గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మోహన్ మృతదేహాన్ని ఆదివారం శివకోడుకు తీసుకొచ్చారు. ఈ సంఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని మృతుడి బంధువులు తెలిపారు. మోహన్ కుమార్ మృతితో ఆయన కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.