ఒకవైపు తండ్రి మరణం..మరోవైపు ఎన్నికల విధులు..
ఇది ఒక అధికారి విషాదంలోనూ విధి నిర్వహించిన ఉదంతం. ఒక వైపు తండ్రి మరణించి విషాదంలో ఉన్నా.. ఉద్యోగ ధర్మం వీడలేదు. ఒక వైపు కొడుకుగా తన బాధ్యత నిర్వహించారు..అదే సమయంలో అధికారిగా తన విధులను సక్రమంగా పూర్తి చేసారు. ఏపి కి చెందిన ఓ ఐఏయస్ అధికారి మనోనిబ్బరం అందరి ప్రశసంలు అందుకుంటోంది.
ఏపి లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉండ్రు లక్ష్మీకాంతరావు పని చేస్తున్నారు. తండ్రికి కొడుకుగా తన ధర్మాన్ని, కీలకమైన ఉద్యోగ విధులను నిర్వర్తించి ఇప్పుడు వార్తల్లో నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామానికి చెందిన రిటైర్డ్ పబ్లిక్ హెల్త్ చీఫ్ ఇంజనీరు ఉండ్రు సూర్యనారాయణ(88) ఈనెల 7వ తేదీన హైదరాబాద్లో అనారోగ్యంతో మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
ఇద్దరు కుమారులు ఐఏఎస్లే. కుమార్తె శాస్త్రవేత్త. సూర్యనారాయణ మొదటి కుమారుడు రాజశేఖర్ హరియాణాలో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ. రెండో కుమారుడైన లక్ష్మీకాంతారావు మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి. పోలింగ్ తర్వాత ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో తీరిక లేకుండా ఉన్న సమయంలో తండ్రి మరణవార్త తెలిసింది. వెంటనే హైదరాబాద్ వచ్చి అక్కడ నుంచి తండ్రి భౌతికకాయాన్ని పాశార్లపూడికి తీసుకొచ్చారు. 8వ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు. 9వ తేదీన ఉదయం చినకార్యం ముగించి, తండ్రి అస్తికలను నిమజ్జనం చేసి ఆ వెనువెంటనే లక్ష్మీకాంతారావు భోపాల్ వెళ్లిపోయారు. 11వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.
తండ్రి మరణం తో మనసు కకలా వికలం అయింది. అయినా...తన స్థానంలో అక్కడ మరో అధికారిని అప్పటికప్పుడు నియమించే పరిస్థితి ఉండదు. అప్పటికే తనకు అప్పగించిన బాధ్యతల పై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కావటంతో.. మరొకరికి ఆ బాధ్యత ఇచ్చినా ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో.. కుమారుడిగా ఎటువంటి బాధ్యత ఉందో..అధికారి గా నూ అంతే బాధ్యత తన పై ఉందని గ్రహించిన లక్ష్మీ కాంతరావు మనో నిబ్బరంతో రెండు బాధ్యతలు పూర్తి చేసారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఇటు ఏపిలో..అటు మధ్యప్రదేశ్లోనూ స్పూర్తి దాయక కధనంగా హల్చల్ చేస్తోంది.