పూజించే వాడే: రాజమండ్రి విగ్రహాన్ని ధ్వంసం చేసిందెవరో తేలింది: డబ్బులు ఎర వేసిన టీడీపీ నేత
రాజమహేంద్రవరం: రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనల్లో నిందితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను పోలీసులు ఛేదించారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. విగ్రహం విధ్వంసం కేసులో వేల రూపాయల్లో డబ్బులు చేతులు మారినట్లు గుర్తించారు. నిందితులపై కేసులు నమోదు చేశారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం చేతులు ధ్వంసం..
రాజమహేంద్రవరం శ్రీరామ్నగర్లోని సంకటహర వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోని నిత్యం పూజలందుకునే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం జనవరి 1వ తేదీ తెల్లవారు జామున ధ్వంసమైన స్థితిలో కనిపించిన విషయం తెలిసిందే. విగ్రహం రెండు చేతులు పగులగొట్టినట్లు గుర్తించారు. ఈ ఘటనపై అప్పట్లో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ఎనిమిది ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు.
పూజారే ప్రధాన నిందితుడు..
సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం ధ్వంసం ఘటనలో పూజారి మరల వెంకట మురళీకృష్ష ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. తన చేతుల మీదుగా విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు నిర్ధారించారు. ఆయనను అరెస్ట్ చేశారు. విగ్రహాన్ని తానే ధ్వంసం చేశానని పూజారి మురళీకృష్ణ అంగీకరించినట్లు సిట్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదే ఘటనలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ భర్త మల్ల వెంకటరాజు, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (టీఎన్టీయూసీ) మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి దంతులూరి వెంకటపతి రాజును అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. టీఎన్టీయూసీ.. తెలుగుదేశం పార్టీ అనుబంధ కార్మిక విభాగం.
Recommended Video
30 వేల రూపాయల కోసం..
పూాజారి మురళీకృష్ణ ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా తీసుకుని, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల ద్వారా లబ్ది పొందాలనే ఉద్దేశమే ఈ ఘటనకు దారి తీసినట్లు అశోక్ కుమార్ తెలిపారు. తన నేరాన్ని మురళీకృష్ణ అంగీకరించారని అన్నారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు, తమ దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చిన సాక్ష్యాధారాల ఆధారంగా మల్ల వెంకటరాజు, దంతులూరి వెంకటపతి రాజును అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. వారిపై సీఆర్ నంబర్ 01/2021, 448, 427, 295, 155 (ఏ) సెక్షన్ల ఆధారంగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో దర్యాప్తును మరింత లోతుగా కొనసాగించాల్సి ఉందని అన్నారు. మరింతమంది ప్రమేయం ఉండే అవకాశాలు లేకపోలేదని అశోక్ కుమార్ అన్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.