చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని డిసైడ్ అయ్యారా.. ? ఏపీలో అంగన్వాడీ కార్యకర్త అరెస్టు
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించేదీ లేదంటూ తొలి రోజునుంచే చెప్పుకొస్తుంది. ఈ విధంగా అధికారులను కూడా అలర్ట్ చేసింది. అయినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు అందాల్సినవి అందడం లేదు. మధ్యలోనే మాయమవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న సరుకులు లబ్ధిదారులకు అందజేయకుండా చేతివాటం ప్రదర్శించిన లక్ష్మీ అనే అంగన్వాడీ మహిళను విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు.
శంఖవరం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలను విజిలెన్స్ అధికారులు ఈ నెల 6వ తేదీన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎస్సీ పేటలో ఉన్న అంగన్ వాడీ మూడవ కేంద్రంను తనిఖీ చేశారు. ఆ కేంద్రంలో జూలై నెలకు అర్హులకు లబ్ధి దారులకు సరఫరా చేయాల్సిన సరుకులు కనిపించలేదు. దీంతో ఆ కేంద్రాన్ని నిర్వహిస్తున్న లక్ష్మీని అధికారులు ప్రశ్నించారు. పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు కొన్ని సరుకులు సరఫరా చేయాల్సిందిగా అంగన్వాడీ కార్యకర్తలకు బాధ్యతలు అప్పజెప్పింది. అయితే అంగన్వాడీ కేంద్రంలో ఈ సరుకులు ఏవీ కనిపించకపోవడంతో విజిలెన్స్ అధికారులు లక్ష్మీని ప్రశ్నించారు. దీంతో ఆమె ఈనెల 4వ తేదీన సరుకులు తీసుకుని సివిల్ సప్లై షాపులో ఉంచామని తెలిపింది. అయితే అక్కడికి వెళ్లి చూడగా అక్కడ కూడా ఎలాంటి సరుకులు కనిపించలేదు.
ఇక అనుమానం వచ్చిన విజిలెన్స్ అధికారులు లక్ష్మీని గట్టిగా ప్రశ్నించారు. దీంతో అసలు నిజం బయటకొచ్చింది. ప్రభుత్వం నుంచి వచ్చిన సరుకులను ఆమె ఇంటికి తరలించింది లక్ష్మీ. ఆమె ఇంటిని తనిఖీ చేయగా 82 కోడిగుడ్లు, 25 కిలోల పీడీఎస్ బియ్యం, చోడిపిండి 22 ప్యాకెట్లు గుర్తించారు విజిలెన్స్ అధికారులు. అంగన్ వాడీ సూపర్ వైజర్ ఫిర్యాదుతో లక్ష్మీపై కేసులు నమోదు చేశారు విజిలెన్స్ అధికారులు. అనంతరం ఆమెను పోలీసు స్టేషన్ు తరలించారు. ఈ అంగన్ వాడీ కేంద్రానికి మొత్తం 130 కేజీల బియ్యం, 29 కేజీల పప్పు, ఆరు ప్యాకెట్ల ఆయిల్, 7.5 కేజీల శనగలు, 2 ప్యాకెట్లు ఉప్పు వచ్చాయి. అయితే కేవలం కొన్ని సరుకులను మాత్రమే ఇంట్లో ఉంచి మిగతా సరుకులను మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వెల్లడించారు విజిలెన్స్ జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధర్ రావు తెలిపారు.