విడుదలకు ముందు రోజే చింతమనేనిపై మరో కేసు నమోదు: ఇక అంతేనా..?
పశ్చిమగోదావరి: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు మరో షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న చింతమనేని ప్రభాకర్.. ఏలూరు జిల్లా కారాగారంలో రిమాండ్లో ఉన్నారు.
టీడీపీ నేత చింతమనేని అరెస్ట్ .. దుగ్గిరాలలో ఉద్రిక్తత
చింతమనేనిపై ఈ నెలన్నర వ్యవధిలో దాదాపు తొమ్మిది కేసులు నమోదు కావడం గమనార్హం. అంతేగాక, ఆయనపై ఇప్పటి వరకు 50 ఫిర్యాదులు వచ్చాయి. పెదవేగి మండలం పినకడిమికి చెందిన జోసెఫ్ అనే వ్యక్తిని బెదిరించాడన్న కారణంతో తాజాగా ఏలూరు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
రిమాండ్లో ఉన్న చింతమనేని ప్రభాకర్ను పిటీ వారెంట్తో అరెస్ట్ చేసి ఏలూరు ఎక్సైజ్ న్యాయస్థానానికి తరలించారు. బెయిల్పై బుధవారం చింతమనేని విడుదల కావాల్సి ఉండగా.. ముందు రోజైన మంగళవారంనాడే పోలీసులు ఆయనపై మరో కేసు నమోదు చేయడంతో ఆయనను మళ్లీ జైలుకు పంపుతారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది.
చింతమనేని మరో ఇద్దరు తనను దుర్భాషలాడారంటూ పిడిమికి చెందిన జోస్ గతంలో ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ కేసులో ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ కాగా, వేరే కేసుల్లో అరెస్టై రిమాండ్లో ఉన్న చింతమనేనినని మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఏ త్రీగా ఉన్న చింతమనేనికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఇప్పుడు మరో కేసు చింతమనేనిపై నమోదైంది.
ఇది ఇలావుంటే, తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే, జనసేన పార్టీ నేత రాపాక వరప్రసాదరావుకు హైకోర్టు షాకిచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని, బ్యాలెట్ ఓట్లలో రిగ్గింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. రాజోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బొంతు రాజేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుతోపాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే రాపాకపై వస్తున్న దొంగ ఓట్లు, రిగ్గింగ్ ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారిని హైకోర్టు ఆదేశించింది.