వీడియో: రంపచోడవరం చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్..వెంట తెలంగాణ మంత్రి
రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. బాధితులను పరామర్శించారు. ఆ సమయంలో వైఎస్ జగన్ వెంట తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు బాలరాజు, జక్కంపూడి రాజా తదితరులు ఉన్నారు. జిల్లాలోని దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పర్యాటక లాంచీ రాయల్ వశిష్ఠ ప్రమాదానికి గురైన ఘటనలో సురక్షితంగా ఒడ్డుకు చేరిన పర్యాటకులు ప్రస్తుతం రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద ఘటన నుంచి 14 మందికి పైగా పర్యాటకులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. వారిని చికిత్స నిమిత్తం రంప ఏరియా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.
నాసా జోక్యం: మరో 48 గంటల్లో ఇస్రో చేతికి విక్రమ్ ల్యాండర్ ఫొటోలు!
వైఎస్ జగన్ ఈ ఉదయం రాజధాని అమరావతి నుంచి హెలికాప్టర్ లో ఈ ఉదయం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా రంపచోడవరానికి చేరుకున్నారు. నేరుగా ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందంటూ బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? వెంట ఎవరెవరు ఉన్నారు? వైద్యి చికిత్స ఎలా అందుతోందని వైఎస్ జగన్ ఆరా తీశారు. అనంతరం ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం అయిదు లక్షల రూపాయల పరిహారాన్ని ఇవ్వనుంది.
అంతకుముందు ఆయన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, పోలీసు సూపరింటెండెంట్ తో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనుమతి లేకునప్పటికీ- లాంచీని గోదావరిలోకి బోటింగ్ కు ఎలా అనుమతి ఇచ్చారో ఆరా తీయాలని చెప్పారు. బాధితుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు ప్రమాదానికి సంబంధించిన తాజా సమాచారాన్ని చేరవేయాలని అన్నారు. కంట్రోల్ రూమ్ లకు వచ్చిన ఫిర్యాదుల గురించి అడిగి తెలుసుకున్నారు. లాంచీ ప్రమాదంపై ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని వైఎస్ జగన్ఓ ఆదేశించారు. గల్లంతైన వారి కోసం చేపట్టిన సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.