గోదావరి జిల్లాలకు ఆ ఇద్దరే: అనంత బాధ్యతలు పెద్దిరెడ్డికే: మంత్రులకు జగన్ కొత్త బాధ్యతలు..
ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత మంత్రుల్లో 13 మందికి కొత్త బాధ్యతలు అప్పగించా రు. ఇందులోనూ రాజకీయ వ్యూహాలతో నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన నాటి నుండి జగన్ ఉభయ గోదావరి జిల్లాల మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఆ రెండు జిల్లాల్లోనూ సామాజిక- రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచు కొని ఒక్క జిల్లాకు ముగ్గురు మంత్రులను కేటాయించారు. ఇప్పుడు తాజా నిర్ణయంలో సైతం ఆ రెండు జిల్లాల మం త్రులకే ఆ జిల్లాల బాధ్యతలను అప్పగించారు. ఇక, రాయలసీమలో కీలకమైన అనంతపురం అభివృద్ది..రాజకీయ పట్టు కోసం సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
సీనియర్ మంత్రులకు కొత్త బాధ్యతలు..
ముఖ్యమంత్రి జగన్ పదమూడు జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించారు. అందులోనూ వ్యూహాత్మకంగానే మంత్రులను ఎంచుకున్నారు. తాజా ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు..అక్కడి రాజకీయ సమీకరణాలు ఆధారంగా ఇన్ ఛార్జ్ మంత్రులను ఖరారు చేసారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న రాజకీయ-సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని ఆ జిల్లాల మంత్రులకే అక్కడి బాధ్యతలు అప్పగించారు. తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆళ్ల నానికి అప్పగించగా..పశ్చిమ గోదావరి జిల్లా బాధ్యతలను పిల్లి సుభాష్ చంద్రబోస్కు కేటాయించారు. ఇద్దరూ ఉప ముఖ్యమంత్రుల హోదాలో ఉన్న నేతలే. పశ్చిమ గోదావరికి బిసి...తూర్పు గోదావరికి కాపు మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణకు విశాఖ జిల్లా ఇన్ఛార్జ్గా నియమించారు.
జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులు ఇలా..
శ్రీకాకుళం-వెల్లంపల్లి శ్రీనివాస్, విశాఖ- మోపిదేవి వెంకటరమణ, విజయనగరం జిల్లా ఇన్చార్జిగా చెరుకువాడ శ్రీరంగనాథ రాజును నియమించారు. ఇక.. తూర్పు గోదావరికి ఆళ్ల నాని.. పశ్చిమ గోదావరికి పిల్లి సుభాష్ చంద్ర బోస్.. కృష్ణా జిల్లా-కన్నబాబు, గుంటూరు- పేర్ని నాని, ప్రకాశం-అనిల్కుమార్ యాదవ్, నెల్లూరు-సుచరిత, కర్నూలు- బొత్స సత్యనారాయణ, కడప- బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, అనంతపురం-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు- మేకపాటి గౌతమ్రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, రాయలసీమలో కీలకమైన రెండు జిల్లాలను ఇద్దరు సీనియర్ మంత్రులకు అప్పగించారు. అనంతపురం జిల్లాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలను కేటాయిస్తూ భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వం..పార్టీ రెండు కళ్లుగా..
ఈ 13 మంది మంత్రులు వారి శాఖలతో పాటుగా కేటాయించిన జిల్లాల్లో అభివృద్ది..పార్టీ వ్యవహారాలను రెండు కళ్లుగా చూసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. జిల్లాలోని ఎమ్మెల్యేలను..పార్టీ నేతలను సమన్వయం చేసుకుం టూ వెళ్లాలని స్పష్టం చేసారు. అదే సమయంలో జిల్లా అభివృద్దికి సంబంధిచి జిల్లా సమీక్షల నిర్వహణ.. ఎమ్మెల్యేల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ధేశించారు. జిల్లా స్థాయిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలోనూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు బాద్యతలు అప్పగించారు. దీని కోసం జిల్లా మంత్రులతో ..ఎమ్మెల్యేలతో చర్చించి ఏకాభిప్రా యంతో నిర్ణయం తీసుకోవాలని సీఎం నిర్ధేశించారు. ఇక, ఇప్పుడు 13 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు నియామకం పూర్తి కావటంతో జిల్లాల వారీగా అభివృద్ది మీద ప్రభుత్వం దృష్టి సారించనుంది.