Karem Sivaji: వైసీపీ తీర్థం పుచ్చుకున్న కారెం శివాజీ: పార్టీ ఎంపీ గొడ్డేటి మాధవితో కలిసి..!
అమరావతి: మాల మహానాడు మాజీ అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. ఆయనకు పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు కొందరు మాల మహానాడు మాజీ నాయకులు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ప్రతినిధులు వైసీపీలో చేరారు.
ఈ మధ్యాహ్నం కారెం శివాజీ.. వైసీపీ లోక్ సభ సభ్యురాలు గొడ్డేటి మాధవితో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి, వైసీపీలోకి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దళితులు, బడుగు, బలహీన వర్గాల కోసం వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలను తీసుకుంటోందని అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా కారెం శివాజీ నియమితులైన విషయం తెలిసిందే. అధికారం మారిన తరువాత కూడా ఆయన అదే పదవిలో కొనసాగారు. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న తరువాత.. గురువారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ మరుసటి రోజే వైఎస్ జగన్ ను కలిశారు. వైసీపీలో చేరారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే నాలుగు లక్షలకు పైగా దళిత, బడుగు, బలహీన వర్గాలకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలను కల్పించడం గొప్ప విషయమని అన్నారు.
గ్రామ వలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయాల ద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధిని కల్పించడం వంటి చర్యలు ఇదివరకు ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదని చెప్పారు. దళితుల్లో ఎక్కువ మంది పారిశుద్ధ్య కార్మికులుగా, నాలుగో తరగతి ఉద్యోగులుగా, అంగన్వాడి కార్యకర్తలుగా పని చేస్తున్నారని, వారి వేతనాలను పెంచడం తనను ఆకట్టుకుందని చెప్పారు. దళితులకు మంత్రివర్గంలో సమాన ప్రాతినిథ్యం కల్పించారని కారెం శివాజీ ప్రశంసించారు. వాటన్నింటినీ చూసి తాను వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.