రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ మరో దారుణం.. డ్రైవర్ను కొట్టి 50 వేలు మాయం..!
రాజమండ్రి : నగరంలో బ్లేడ్ బ్యాచులు రెచ్చిపోతున్నాయి. జనాలపై దాడులు చేస్తూ అందినకాడికి దోచుకెళుతున్నాయి. ఇదివరకు ఎన్నో ఘటనలు వెలుగుచూసినా.. బ్లేడ్ బ్యాచుల ఆట కట్టించిన సందర్భాలు తక్కువే. పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతోనే వారు యధేచ్ఛగా దోపిడీ పర్వం కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఆ క్రమంలో ఆదివారం నాడు బ్లేడ్ బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. ప్రకాష్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ లారీని నిలువరించి 50 వేల రూపాయలు దోచుకెళ్లిన ఘటన వెలుగుచూసింది. సీతానగరం ప్రాంతంలోని లక్ష్మి రుద్ర ట్రాన్స్ పోర్టుకు చెందిన లారీ బొమ్మూరు వైపు లోడుతో వెళుతున్న సమయంలో హైవేపై అటకాయించారు. మద్యం మత్తులో ఉన్న బ్లేడ్ బ్యాచ్ సభ్యులు లారీకి అడ్డంగా నిలబడ్డారు. లారీ డ్రైవర్ వెంకటేశ్ ఎంతసేపు హారన్ కొట్టినా వారు పక్కకు తప్పుకోలేదు.
భూ తగదా కాటేసిందా.. పార్ట్నర్ చంపేశాడా.. రాం ప్రసాద్ మర్డర్ కేసులో ట్విస్టేంటి?
హైవే సమీపంలోని వైన్ షాపులో మద్యం తీసుకున్న తొమ్మిది మంది యువకులు ఫుల్లుగా తాగి లారీని అడ్డగించినట్లు తెలుస్తోంది. లారీ డ్రైవర్ చాలాసేపు హారన్ కొట్టినా వారు పట్టించుకోలేదు. పైగా తాము రోడ్డు దాటుతుంటే హారన్ కొడతారా అంటూ డ్రైవర్, క్లీనర్పై దాడికి తెగబడ్డారు. వారిని కిందకు దించి చితకబాదారు. రాళ్లు రువ్వి లారీ అద్దాలు పగులగొట్టారు.
అక్కడితో ఆగకుండా లారీలో ఉన్న 50 వేల రూపాయలు లాక్కుని పరారయ్యారు. గాయాలపాలైన లారీ డ్రైవర్ వెంకటేశ్ను, క్లీనర్ ప్రసాద్ను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు స్థానికులు. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.