బోట్ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవంలో రచ్చ... ప్రోటోకాల్ పాటించకుండా ఎంపీకి అవమానం...
దేశంలోనే మొదటిసారిగా సురక్షిత పర్యాటకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 9 చోట్ల బోట్ కంట్రోల్ రూమ్స్ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా రాజమండ్రి బోట్ కంట్రోల్ రూమ్ వద్ద రగడ చోటు చేసుకుంది. శిలాఫలకంపై స్థానిక ఎంపీ మార్గాని భరత్ పేరును విస్మరించడంతో.. ప్రోటోకాల్ నిబంధనలు ఎందుకు పాటించలేదని ఎంపీతో పాటు ఆయన అనుచరులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
|
ఎంపీ భరత్ ఏమన్నారంటే...
ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు మంచి పేరు వచ్చేలా అధికారులు వ్యవహరించాలని ఎంపీ భరత్ అన్నారు. ప్రోటోకాల్ పాటించకపోవడంపై టూరిజం శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ అయినా,అధికార పార్టీ అయినా.. పదవిలో ఉన్నప్పుడు కచ్చితంగా అధికారులు ప్రోటోకాల్ పాటించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదం మరోసారి జరగకుండా చూసుకోవాలని అధికారులకు చెప్పినట్టు తెలిపారు. అదే సమయంలో ఎంపీ అనుచరులు.. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలాకాన్ని తీసుకెళ్లి లోపల దాచిపెట్టారు. దానిపై తమ ఎంపీ పేరు లేకపోవడంతో దాన్ని వాడవద్దని చెప్పారు. ఎంపీ,ఆయన అనుచరుల వాగ్వాదం కాస్త రగడ చోటు చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత వారు శాంతించడంతో అంతా సర్దుకుంది.
తహశీల్దార్ స్థాయి అధికారి పర్యవేక్షణలో..
గతేడాది కచ్చలూరు బోట్ ప్రమాదం తర్వాత పర్యాటక రంగంపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా 9 బోట్ కంట్రోల్ రూమ్స్ను ఏర్పాటు చేసింది. ఇందులో నాలుగు విభాగాలకు చెందిన అధికారులు పనిచేయనున్నారు. రెవెన్యూ శాఖకు చెందిన తహశీల్దార్ లేదా ఇతర అధికారి మేనేజర్గా వ్యవహరిస్తూ అక్కడి కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. అలాగే నీటి పారుదల శాఖకు చెందిన ఒక ఇంజనీర్ కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తారు. బోట్ల పనితీరు,ఇతరత్రా టెక్నికల్ అంశాలను ఆయన పర్యవేక్షిస్తారు. ఇక్కడ ఉండే కంప్యూటర్ ఆపరేటర్ ప్రయాణికులు,బోట్ సిబ్బంది వివరాలను డేటా బేస్లో భద్రపరుస్తారు.
Recommended Video
పకడ్బందీ చర్యలు
ఇంతకుముందులా కాకుండా.. ఇకపై బోట్ కంట్రోల్ రూమ్ అనుమతించాకే అవి ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది. బోట్కు రిజిస్ట్రేషన్ ఉందా.. లేదా.. ప్రయాణం సురక్షితమేనా అన్న అంశాలను పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. కంట్రోల్ రూమ్ వద్దే ప్రయాణికుల కోసం వెయిటింగ్ రూమ్,వాష్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అత్యవసర ప్రకటనల కోసం స్పీకర్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. కాగా, బోటింగ్ ఆపరేషన్స్ను జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలని జగన్ ఆదేశించారు. కంట్రోల్ రూమ్లు నిబంధనలు పాటిస్తున్నాయా లేదా పరిశీలించాలన్నారు.