సత్యం బృందానికి సన్మానం.. 20 లక్షల చెక్ అందజేత
సాంకేతికతో సాధ్యం కాని దాన్ని సాంప్రదాయ పద్దతిలో చేసి చూపించిన ధర్మాడి సత్యం బృందాన్ని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఒప్పందం ప్రకారం సత్యంకు చెందిన బాలాజీ మెరైన్ సంస్థకు ఇవ్వాల్సిన 20 లక్షల రూపాయల చెక్ను కలెక్టర్ మురళీధర్ రెడ్డి అందజేశారు. కాగా బోటును బయటకు తీసే ఆపరేషన్ కోసం మొత్తం 23 లక్షల రుపాయలను ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
సుడిగుండాల మధ్య చిక్కుకున్న రాయల్ వశిష్ట బోటును వెలికి తీసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. బోటులోనే మృతదేహాలు చిక్కుకోవడంతో దాన్ని వెలికి తీస్తేగాని మృతదేహాలు బయటకు రాని పరిస్థితి కనిపించింది. దీంతో బోటును వెలికి తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ తోపాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం ప్రయత్నాలు చేశాయి. గోదావరి ఉదృతి ఎక్కువగా ఉండడంతో వారి ప్రయత్నాలు విరమించుకున్నారు.
దీంతో బోటును వెలికి తీయడంపై పలు అనుమానాలు వెలిశాయి. బోటు బయటకు తీయడం కష్టమని తేల్చడంతో ఈ అనుమానాలు మరింత బలబడ్డాయి. మరోవైపు మాజీ ఎంపీ హర్షకుమార్ బోటు వెలికితీతపై పలు విమర్శలు చేశారు. బోటులో 90 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని ఆయన నిరాధార ఆరోపణలు చేశారు. దీంతో ప్రభుత్వం బోటును వెలికి తీసేందుకు కంకణం కట్టుకుంది. వెంటనే ధర్మాడి సత్యం బృందాన్ని రంగంలోకి దింపింది. దీంతో సాంప్రదాయ పద్దతిలో బోటును వెలికి తీసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే చివరికి విశాఖ నుండి మెరైన్ డైవర్స్ వచ్చి సహాయం చేశారు. డైవర్స్ నేరుగా ఆక్సిజన్ మాస్క్లతో నీళ్లలోకి దిగి బోటుకు నేరుగా లంగర్లు వేశారు. దీంతో సత్యం బృందంతోపాటు విశాఖ నుండి వచ్చిన వారి ప్రయత్నాలతో సుమారు ఆరురోజుల పాటు తర్వాత బోటు బయటపడింది.