రాజమండ్రి జైలుకు నకిలీ రైతు శేఖర్ చౌదరి: మొన్న..నిన్న..చివరికి నేడు ఇలా!
కాకినాడ: కృష్ణానదికి భారీగా వరదలు సంభవించిన సమయంలో రైతుగా వేషం కట్టి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ను దూషించిన కేసులో అరెస్టయిన జూనియర్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి జైలు పాలయ్యారు. ఆయనను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. ఎన్నికల ప్రచార సమయంలో శేఖర్ చౌదరి తెలుగుదేశం పార్టీ తరఫున పలు రాజకీయ ప్రకటనల్లో నటించారు. ఒక్కో యాడ్ లో ఒక్కో అవతారంలో కనిపించారాయ. కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో ఆయన రైతు వేషం వేశారు. మోకాలి లోతు నీటిలో నిల్చుని.. తనపై ఓ వీడియోను చిత్రీకరించుకున్నారు.
ఏపీ ప్రభుత్వానికి పీటీ ఉష, సానియా మిర్జాలకు తేడా తెలియకపోతే ఎట్టా? హాయ్ రబ్బా స్మిత
తమ పంటపొలాలు వరద నీటి పాలయ్యాయని, తమను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. ముఖ్యమంత్రిని వెధవగా సంబోధించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను కులం పేరుతో దూషించారు. గొర్రెలు, మేకలు కాచుకునే వారు మంత్రిగా ఉంటే.. ఇలాగే ఉంటుంది.. అని విమర్శించారు. ఈ వీడియో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. స్వయంగా మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ఈ వీడియోను ట్వీట్ చేశారు. అనంతరం ఆయన దాన్ని తొలగించారు. ముఖ్యమంత్రి, మంత్రిని దూషించడంపై పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కులం పేరుతో దూషించినందున పలువురు యాదవ సంఘాల ప్రతినిధులు శేఖర్ చౌదరిపై విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు.
శేఖర్ చౌదరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన కోసం అన్వేషణ చేపట్టారు. గుంటూరు జిల్లా వేమూరు నివాసిగా గుర్తించారు. ఈ నెల 24వ తేదీన ఆయనను అరెస్టు చేశారు. కస్టడీకి తరలించారు. విజయవాడ సూర్యారావు పేటలోని నేర నియంత్రణ విభాగం కార్యాలయంలో విచారించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక విషయాలను బయటపెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
కొందరు జూనియర్ ఆర్టిస్టులను ఓ ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు డబ్బులు ఇచ్చి, ఇలాంటి వీడియోలను చిత్రీకరించేలా ఏర్పాట్లు చేశారనే విషయాన్ని పోలీసుల విచారణ సందర్భంగా శేఖర్ చౌదరి వెల్లడించినట్లు తేలింది. కస్టడీ ముగిసిన వెంటనే ఆయనను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.