గోదావరిలో నాలుగు మృతదేహాలు: కచ్చలూరు ప్రమాద బాధితులవేనా?
రాజమహేంద్రవరం: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ పరిధిలో శుక్రవారం నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల జరిగిన కచ్చలూరు బోటు ప్రమాదంలో ఇంకా 15మంది మృతదేహాలు లభ్యం కాలేదని అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శుక్రవారం లభ్యమైన నాలుగు మృతదేహాలు కచ్చలూరు ప్రమాద బాధితులవేనా? అనేది తెలియాల్సి ఉంది. అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గురైన బోటును వెలికితీసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందానికి ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించింది. అయితే, రెండుసార్లు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, గోదావరి వరద ఉధృతి భారీగా ఉండటంతో ప్రయత్నాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇది ఇలా ఉండగా, కడపలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కడప జిల్లా చిన్నమండెం మండలం కేశాపురం సమీపంలో కడప-బెంగళూరు ప్రధాన రహదారిపై ఓ కారు ఎదురుగా వచ్చిన లారీని వేగంగా ఢీకొనడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులను కడపకు చెందిన బుజ్జి, హర్షవర్ధన్, భూదేవీగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మృతదేహాలు నుజ్జునుజ్జుకావడంతో బయటకు తీయడం కొంత ఆలస్యమైంది. బెంగళూరులో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బంధువులను చూసేందుకు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
బంగ్లా కోస్టు గార్డుల అదుపులో విశాఖ జాలర్లు
ఏపీకి చెందిన ఎనిమిది మంది మత్స్యకారులను బంగ్లాదేశ్ కోస్టుగార్డు అదుపులోకి తీసుకుంది. విశాఖ పరిధి కొత్త జాలరిపేటలోని వాసుపల్లి రాములుకు చెందిన మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు 'అమృత' పది రోజుల క్రితం చేపల వేటకు బంగాళాఖాతంలోకి వెళ్లింది. గురువారం సాయంత్రం బంగ్లాదేశ్ జల సరిహద్దులోకి వెళ్లడంతో ఆ దేశ కోస్టుగార్డు అదుపులోకి తీసుకున్నారు.