గోదావరి వరదలు .. చిగురుటాకుల్లా వందలాది గోదావరి జిల్లాల ముంపు గ్రామాలు.. రంగంలో రెస్క్యూ టీమ్స్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి ఉగ్రరూపంతో విరుచుకు పడుతోంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న పలు మండలాల ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు చిగురుటాకుల్లా వణుకుతున్నారు. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరికి వరద పోటెత్తడంతో ఇప్పటికే పలు గ్రామాలు నీటమునిగాయి.
భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం ...మూడో ప్రమాద హెచ్చరిక దాటి .. ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధం
తూర్పుగోదావరి జిల్లాలో 14 మండలాలపై వరద ప్రభావం
తూర్పుగోదావరి జిల్లాలో 14 మండలాలపై వరద ప్రభావం కనిపిస్తుంది. విలీన మండలాలు పూర్తిగా నీట మునిగాయి. దేవీపట్నం మండలం లో 36 గ్రామాల్లో మూడు వేలకు పైగా ఇళ్లను గోదావరి వరద ముంచెత్తింది. తూర్పు మన్యం లోని 28 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక వరద ముంపులో చిక్కుకున్న వారిని కాపాడడం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 68 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటికే ఆరు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పోలవరం వద్ద వరద ఉధృతి
వరద బాధితుల తరలింపు కోసం 14 లాంచీలను, 86 బోట్లను ఉపయోగిస్తున్నారు.వారికి కావలసిన నిత్యావసర వస్తువులు సైతం అందిస్తున్నారు. సహాయక చర్యల్లో కరోనాను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. పోలవరం వద్ద నీటి మట్టం 15.730 మీటర్లకు చేరింది . కాపర్ డ్యాం వద్ద 30.800 మీటర్లకు వరద నీరు చేరుకుంది .
పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపులో లంక గ్రామాలు
పశ్చిమ గోదావరి జిల్లాను గోదావరి వరదలు ముంచెత్తుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో 19 ముంపు గ్రామాల్లో 1543 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. వేలేరుపాడు మండలంలో నాలుగు వేల మంది నిరాశ్రయులయ్యారు. వారిని సహాయక సిబిరాలకు తరలించారు . గోదావరి గట్టు తెగి పోలవరం గ్రామంలో ప్రవేశించే అవకాశం ఉన్నందున పోలవరం గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డెల్టాలోని యలమంచిలి, ఆచంట, నరసాపురం, పెరవలి, నిడదవోలు మండలాల్లో లంక గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
సహాయక చర్యల్లో ఖర్చుకు వెనకాడవద్దు : సీఎం జగన్
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి మహోగ్రంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో మరింత వరద దిగువకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది. వరద బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయాన్ని అందించాలని, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు. పరిస్థితులను పర్యవేక్షిస్తున్న సీఎం జగన్ వరద బాధితుల సహాయ విషయంలో ఖర్చుకు వెనుకాడ వద్దని జిల్లా అధికారులకు ఆదేశించారు.
Recommended Video
ధవళేశ్వరం వద్ద ప్రమాదకరంగా గోదావరి
మరోపక్క ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి అత్యంత ప్రమాదకర స్థాయిలో అక్కడ ప్రవహిస్తోంది. మొత్తం 175 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 19.60 అడుగులకు పెరిగింది. 22.90 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది.