Private Bus: హైదరాబాద్ టు వైజాగ్: డివైడర్ ఎక్కేసిన ప్రైవేటు బస్సు: వృద్ధుడిని తప్పించబోయి..!
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం తృటిలో తప్పింది. నియంత్రణ కోల్పోయిన ఓ ప్రైవేటు బస్సు జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పైకి ఎక్కి నిలిచిపోయింది. డివైడర్ ను దాటుకుని ఉంటే.. ఎదురుగా వస్తోన్న వాహనాలను అతివేగంగా ఢీ కొట్టి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో ప్రైవేటు బస్సులో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు తగల్లేదు. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
TTD: టీటీడీలో 300 బంగారు నాణేలు మాయం: నాలుగేళ్లుగా చేతివాటం: రిటైర్డ్ ఉద్యోగులపై విచారణ
జిల్లాలోని ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన బస్సు ఆదివారం రాత్రి సుమారు 50 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి బయలుదేరింది. ఈ ఉదయం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఆలమూరు మండలంలోని మూలస్థానం అగ్రహారం సమీపంలోని జాతీయ రహదారిపై విశాఖపట్నం వైపు దూసుకెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది.
మూలస్థానం అగ్రహారానికి చెందిన ఓ వయోధిక వృద్ధుడు రోడ్డు దాటడానికి ప్రయత్నించారని, అనూహ్యంగా రోడ్డు మధ్యకు వచ్చిన ఆయనను చూసిన ప్రైవేటు బస్సు డ్రైవర్ సడన్ గా బ్రేకులను వేయడంతో బస్సు అదుపు తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సడన్ గా బ్రేకులు వేయడంతో బస్సు ఒక్కసారిగా కుదుపులకు లోనై.. రోడ్డు డివైడర్ పైకి ఎక్కిందని వెల్లడించారు. ఆ సమయంలో బస్సు సుమారు 80 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తూ ఉండొచ్చని చెప్పారు.
అదే వేగంతో డివైడర్ ను దాటి.. అవతలి వైపు రోడ్డు మీదికి వెళ్లి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేదనే అనుమానాలను వ్యక్తం చేశారు ప్రత్యక్ష సాక్షులు. అవతలి వైపు రోడ్డు మీద ఎదురుగా వచ్చే వాహనాలను ఢీ కొట్టి ఉంటే ప్రమాదం తీవ్రత అధికంగా ఉండేదని చెబుతన్నారు. ఈ ఘటనలో బస్సు రాసుకుంటూ వెళ్లిపోవడంతో రోడ్డు దాటడానికి ప్రయత్నించిన వృద్ధుడికి స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఆలమూరు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులను వేరే బస్సులో విశాఖపట్నానికి పంపించారు.