వైసీపీ అధికారంలోకి వస్తే కొడాలి నాని హోం మంత్రి ? నాని ఏమన్నారంటే
ఎన్నికల ఫలితాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న గట్టి నమ్మకం ఆ పార్టీ నేతలకు ఇప్పుడు ఎక్కడలేని కొత్త ఆశలకు కారణం అవుతుంది. ఎవరికి వారు నేనే మంత్రి అన్న ఊహల్లో విహరిస్తున్నారు. అంతేనా అనుచరగణం ప్రచారం అయితే ఇక చెప్పనక్కరలేదు .ఇప్పటికే పలువురు ముఖ్య నాయకులు తమ ఇళ్ళల్లో ముఖ్య నాయకులతో సమావేశాలు , చర్చలు పెడుతున్నారు. అంతర్గతంగా వ్యవస్థను సెట్ చేసుకునే పనిలో పడ్డారు.
కాబోయే మంత్రి అన్న ప్రచారంపై జగన్ క్లాస్ పీకారట .. అందుకే ఉదయభాను అలర్ట్ అయ్యారట
వైసీపీ అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాలోమంత్రి ఎవరన్న దానిపై చర్చ
జిల్లాల వారీగా ఎక్కడికక్కడ వైసీపీ కేడర్ మంత్రులు ఎవరా అన్న లెక్కలను వేస్తోంది. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఇంకా ఎమ్మెల్యేలుగానే గెలవలేదు . అధికారం చేతికీ రాలేదు. అప్పుడే క్యాబినెట్ కలల్లో మునిగి తేలుతున్నారు వైసీపీ నేతలు. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఆ జిల్లా నుండి వైసీపీకి అధికారం వస్తే మంత్రి ఎవరు అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జిల్లాలోని మొత్తం 16 అసెంబ్లీ అభ్యర్ధుల చుట్టూ మంత్రి ఎవరు కాబోతున్నారన్న అన్న అంశంపై చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది.
కొడాలి నానికి హోం మంత్రిత్వ శాఖ ఇస్తారని ప్రచారం
ఇక మంత్రిగా అందరి చూపు కొడాలి నానిపై పడింది . దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు ప్రతాప్రెడ్డిపై ఈ సారి కొడాలి నాని పోటీచేశారు. కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం మరోసారి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్కు అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరుగా కొడాలి నానికి పేరుంది. అలాగే పార్టీలో ఉన్న ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరుగా, కీలక నిర్ణయాలు తీసుకునే నేతగా నానికి పేరుంది. ఇలా అన్ని అర్హతలు ఉన్న కొడాలి నానికి వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవి వర్గం ఖాయమని ఆయన అనుచరవర్గం చెబుతోంది. జగన్ ముఖ్యమంత్రి కాగానే, కొడాలి నానికి ఏకంగా హోంశాఖ బాధ్యతలు అప్పచెప్పడం ఖాయమని జిల్లాలో విస్తృత స్థాయిలో సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది .
సోషల్ మీడియాలో మంత్రి పదవిపై వస్తున్న వార్తలపై స్పందించిన కొడాలి నాని
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కొడాలి నాని స్పందించారు. వైసీపీలోకి అధికారంలోకి రావడం పక్కా అని, అయితే, తనకు వైఎస్ జగన్ తనకు మంత్రి పదవి ఇచ్చినా, ఇవ్వకున్నా జగన్ వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు . ఒకవేళ మీరు గెలిచి , వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ నుంచి ఏ పదవిని ఆశిస్తున్నారని కొడాలి నానిని అడిగిన మీడియాకు ఆయన తన సంచలన నిర్ణయం వెల్లడించారు.
జగన్ అడుగుజాడల్లో నడుస్తా ... జగన్ నిర్ణయమే శిరోధార్యం అన్న కొడాలి నాని
ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గెలుపే లక్ష్యంగా తామంతా పనిచేశామని, తాము పడ్డ కష్టాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రజలు వైసీపీని ఆశీర్వదించారని, ఆ ఫలితాలే మే 23న వెలువడనున్నాయని కొడాలి నాని తెలిపారు.తాను రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు వైసీపీలోనే ఉంటూ, జగన్ అడుగు జాడల్లో నడుస్తానని కొడాలి నాని చెప్పుకొచ్చారు . ఇక మంత్రిగా అవకాశం ఇచ్చే విషయంలో వైఎస్ జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తానని కొడాలి నాని చెప్పటం విశేషం .