గోదావరి నీళ్లను కృష్ణానదిలోకి తరలించడం మంచిదే, కాని...
కృష్ణానదిలోకి గోదావరి నీళ్ళను మళ్లించడం, మంచి నిర్ణయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. అయితే ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. గత రెండు రోజులుగా సీపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక దేశం తిరోగమన దిశలో వెళుతోందని ఆయన విమర్శించారు. దేశ వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ సంక్షోభానికి వ్యతిరేకంగా ఆక్టోబర్ 10 నుండి వారం రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న నీటి చర్చలపై ఆయన స్పందించారు. నదుల అనుసంధానం తోపాటు ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపడం మంచిపరిణామమని ఆయన అన్నారు. అయితే ముఖ్యమంత్రులు తీసుకునే నిర్ణయాలు వారి వ్యక్తిగతం కాకుడని చెప్పిన ఆయన ముఖ్యమంత్రులు ఎప్పుడు శాశ్వతం కాదని, ప్రజలే శాశ్వతంగా ఉంటారని అన్నారు.
ఇక ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వాల పతనం తప్పదని ఆయన హెచ్చరించారు. కేంద్రం చేపట్టిన యురేనియం తవ్వకాలను ఆయన వ్యతిరేకించారు. యురేనియం తవ్వకాల వల్ల రెండు రాష్ట్రాల్లో ఉన్న కృష్ణా గోదావరి నదులు కలుషితం అవుతాయని ఆయన అన్నారు. తవ్వకాలపై సీపీఐ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని ఆయన చెప్పారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపడాన్ని కూడ ఆయన ప్రస్తావించారు.