జనసేన ఎమ్మెల్యే కేసులో పోలీసులకు షాక్: బెయిల్ ఇవ్వాలని ఆదేశించిన కోర్ట్..!!
కాకినాడ: జనసేన పార్టీ శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్ అరెస్టు వ్యవహారం సుఖాంతమైంది. మంగళవారం రాజోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన ఆయనను పోలీసులు స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. దీనిపై విచారణ చేపట్టిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం న్యాయమూర్తి.. ఆయనకు వెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలని పోలీసులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులను కేసుల విచారణ తమ పరిధిలోకి రాదని, విజయవాడ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పోలీసులకు సూచించారు. దీనితో- రాపాకకు అప్పటికప్పుడు స్టేషన్ బెయిల్ ను మంజూరు చేశారు రాజోలు పోలీసులు.
పరిస్థితి చేయి దాటితే.. నేనే వస్తా: చాలా చిన్న విషయం: గోటితో పోయే దానికి గొడ్డలిదాకా తెస్తారా?: పవన్
అంతకుముందు- జిల్లాలోని మలికిపురం పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన కేసులో పోలీసులు రాపాక వరప్రసాద్ పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఆయన అనుచరులు 30 మంది పై సెక్షన్ 143,147,148,341,427 r/w 149 ఐపీసీ, 7 సీఎల్ఏ - 1932, 3పీడీపీపీఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనితో కొంత సమయం వరకు ఆయన అదృశ్యం అయ్యారు. మధ్యాహ్నం ఆయన రాజోలు పోలీస్ స్టేసన్ లో లొంగిపోయారు. వెంటనే పోలీసులు ఆయనను రాజోలు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆయన పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సందర్భంగా రాజోలులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 200 మందికి పైగా ఆయన అనుచరులు, జనసేన పార్టీ కార్యకర్తలు రాజోలు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు.
ఈ సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ నయీం హష్మి.. రాజోలులో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తాను స్వచ్ఛందంగా లొంగిపోయానని, పోలీసులు అరెస్టు చేయలేదని రాపాక వరప్రసాద్ వెల్లడించడంతో జనసేన పార్టీ కార్యకర్తలు శాంతించారు. అనంతరం ఆయనను న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. ఈ కేసు వెనుక గల పూర్వాపరాలను గురించి ఆరా తీశారు న్యాయమూర్తి. ప్రజా ప్రతినిధులను విచారించడం తమ పరిధిలో లేదని, విజయవాడ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పోలీసులకు సూచించారు. రాపాక వరప్రసాద్ కు స్టేషన్ బెయిల్ ను ఇవ్వాలని ఆదేశించారు.