పరిస్థితి చేయి దాటితే.. నేనే వస్తా: చాలా చిన్న విషయం: గోటితో పోయే దానికి గొడ్డలిదాకా తెస్తారా?: పవన్
కాకినాడ: జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఉదంతంపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. గోటితో పోయే దానికి గొడ్డలి దాకా తీసుకొస్తారా? అంటూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అది చాలా చిన్న విషయమని, దీన్ని ప్రభుత్వం తెగే దాకా లాగుతోందని అన్నారు. స్టేషన్ బెయిల్ ఇస్తే.. ముగిసిపోయే ఈ వివాదానికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ ను జారీ చేసే స్థాయికి తీసుకొచ్చారని విమర్శించారు. తాను రెండు రోజులుగా ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నానని, పరిస్థితి చేయి దాటేంత వరకూ వస్తే తానే వచ్చి రాజోలులో కూర్చుంటానని హెచ్చరించారు. సోమవారం మధ్యాహ్నం ఆయన జనసేన పార్టీ సొంత యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడారు. 2 నిమిషాల 55 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోను యూట్యూబ్ లో విడుదల చేశారు.
జనసేన ఎమ్మెల్యే ఆందోళన పేకాట రాయుళ్ల కోసమా? కేసు నమోదు చేసిన పోలీసులు
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు..
తమ పార్టీ ఎమ్మెల్యేపై పోలీసులు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేయడం పట్ల పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గోటితో పోయే దానికి గొడ్డలి దాకా తీసుకొచ్చారని విమర్శించారు. చిన్న విషయాన్ని ప్రభుత్వం భూతద్దంలో చూస్తోందని మండిపడ్డారు. స్టేషన్ బెయిల్ ఇస్తే.. సరిపోయే అంశాన్ని నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ దాకా తెచ్చారని, దీని వెనుక రాజకీయ కారణాలు, రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని చెప్పారు. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉదంతాన్ని పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఒక జర్నలిస్ట్ మీద దాడికి పాల్పడి, కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తే.. ఆయనపై నామమాత్రంగా కేసు పెట్టారని విమర్శించారు.
తెగే దాకా లాగొద్దు..
ఇప్పటికైనా తమ ఎమ్మెల్యే కేసు వ్యవహారాన్ని పొడిగించకుండా, సామరస్యంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా, సంయమనం పాటించాలని పవన్ కల్యాణ్ తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పరిస్థితులు చేయి దాటేలా కనిపిస్తే తానే వచ్చి రాజోలులో కూర్చుంటానని చెప్పారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన విమర్శించారు. తమ సొంత ఎమ్మెల్యేపై నామ్ కే వాస్తే గా కేసు నమోదు చేసి, తమ పార్టీ ఎమ్మెల్యేపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేయడం పరిస్థితులను చేయి దాటిపోయేలా ప్రభుత్వం గానీ, అధికారులు గానీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సంయమనంతో, సామరస్యంతో ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రాపాకపై కేసు నమోదు
తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్ ఆదివారం రాత్రి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తన నియోజకవర్గం పరిధిలోని మలికిపురం పోలీస్ స్టేషన్ ను ఆయన ముట్టడించారు. తన అనుచరులు, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. ధర్నాకు దిగారు. మలికిపురం ఎస్సై కేవీ రామారావు తనను దుర్భాషలాడారని, వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. ఇదంతా పేకాట రాయుళ్లను విడిపించడానికేనంటూ వార్తలు వెలువడ్డాయి. పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన ఆయనపై జిల్లా పోలీసులు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేశారు. ప్రస్తుతం రాపాక వరప్రసాద్ ఎక్కడా కనిపించట్లేదని అంటున్నారు. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.