కాకినాడ పోర్టుకు పటిష్ట భద్రత : ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ డీజీపీ
కాకినాడ : ఎన్నికల కౌంటింగ్ కు సమయం సమీపిస్తోన్న వేళ ఏపీకి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీచేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసు అధికారులతో ఏపీ డీజీపీ ఠాకూర్ సమీక్ష నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నిఘావర్గాలు హెచ్చరికలను బహిర్గతం చేయకూడదని .. అందుకే చెప్పడం లేదని స్పష్టం చేశారు.
భద్రతపై సమీక్ష
ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో తూర్పు తీరంలో ఉన్న ఆయిల్, గ్యాస్ కంపెనీల భద్రతపై ఏపీ డీజీపీ ఠాకూర్ సమీక్షించారు. కాకినాడలో పోలీసులు అధికారులతో మాట్లాడారు. ఏవోబీ బోర్డర్లో జరిగిన ఘటనలపై డీజీపీ, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఏవోబీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. ఇటీవల ఎన్నికల పోలింగ్లో జరిగిన ఘటనలు, కౌంటింగ్ భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులకు పల సూచనలు చేశారు. భద్రతా కారణాల రీత్యా కొన్ని వివరాలు వెల్లడించలేమని తెలిపారు.
చమురు క్షేత్రాల్లో పరిస్థితిపై ఆరా ..
గాడిమొగ రిలియన్స్ గ్యాస్ టెర్మినల్తోపాటు పలు చమురు క్షేత్రాల్లో డీజీపీ పర్యటించారు. ఎన్నికల సమయంలో జిల్లాలో చోటుచేసుకున్న ఘర్షణలపై సమీక్షించామని తెలిపారు. కేసుల నమోదు, చార్జ్షీట్లపై యంత్రాంగానికి తగిన సూచనలు చేశామని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ భద్రతపై ఎటువంటి చర్యలు చేపట్టాలో అధికారులకు పలు సూచనలు చేశామన్నారు. ఆయా కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లు పటిష్ట భద్రత మధ్య ఉన్నాయని పేర్కొన్నారు. 23న ఉదయం పోలింగ్ ప్రారంభిస్తామని .. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం కూడా తగిన ఏర్పాట్లు చేసింది.
బీ అలర్ట్
అయితే ఒడిషాలోని నందాపూర్ మావోయిస్టు కమిటీ సభ్యులు విధ్వంసం సృష్టించేందుకు మన రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చారని సమాచారం తమ వద్ద ఉందని డీజీపీ తెలిపారు. ఎన్నికలు ముగిసిన తరువాత తిరిగి వెళ్తుండగా భద్రతా బలగాలకు తారసపడడంతో ఎన్కౌంటర్ జరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని వివరించారు. అయితే ప్రస్తుతం మాత్రం ఏవోబీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని తెలిపారు.